Telugu Global
Telangana

జంట జలాశయాల నీటి నాణ్యత పెంపునకు నాలుగు ఎస్టీపీలు

రాష్ట్ర మున్సిపల్ శాఖ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఎస్టీపీ నిర్మాణానికి రూ.82 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

జంట జలాశయాల నీటి నాణ్యత పెంపునకు నాలుగు ఎస్టీపీలు
X

దేశంలోని ఏ నగరంలో కూడా లేని విధంగా హైదరాబాద్‌లో 100 శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మూసీ, జవహర్‌నగర్, మీర్ ఆలం ట్యాంక్ వంటి ప్రాంతాల్లో ఎస్టీపీలను ఏర్పాటు చేశారు. తాజాగా జంట జలాశయాల్లో నీటి నాణ్యతను మెరుగు పరచడానికి నాలుగు ఎస్టీపీలను నిర్మించనున్నారు. చారిత్రాత్మక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కొన్ని దశాబ్దాలుగా నగరానికి తాగు నీటిని అందించాయి. ప్రస్తుతం నగర అవసరాలకు 95 శాతం తాగు నీరు కృష్ణా నది నుంచి తీసుకుంటున్నారు.

ఈ జంట జలాశయాల చుట్టు పక్కల ప్రాంతాలు నగరీకరణ చెందడంతో డ్రైనేజీ నీళ్లు వీటిలో కలుస్తున్నాయి. దీంతో మంచి నీళ్లు కలుషితం అవుతున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడేయడానికి నాలుగు ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రతిపాదించింది. రోజుకు 20 ఎంఎల్‌డీ నీటిని శుద్ది చేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఎస్టీపీ నిర్మాణానికి రూ.82 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇప్పటికే సంబంధిత నిధుల కేటాయింపు ఫైలుపై సంతకం చేశారు.

ఈ నాలుగు ఎస్టీపీలను జలాశయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 111ను జారీ చేసింది. ఈ రెండు జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్‌టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో నిర్మించిన ఇండస్ట్రీస్, రెసిడెన్షియల్ కాలనీలు, హోటల్స్ ఎలాంటి సీవరేజ్ నీటిని ఇందులో కలపరాదని ప్రభుత్వం పేర్కొన్నది. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎస్టీపీలతో పాటు డైవర్షన్ ఛానల్స్ కూడా నిర్మించిన జలాశయాలు రక్షించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

First Published:  1 May 2023 5:13 AM GMT
Next Story