Telugu Global
Telangana

ప్రాణాలు తీసిన గాలిపటాలు.. - వేర్వేరుచోట్ల నలుగురు మృతి

నాగోల్‌లో 8వ తరగతి చదువుతున్న శివప్రసన్న కూడా ఆదివారం తాము నివాసం ఉంటున్న నాలుగంతస్తుల మేడపైకి గాలిపటం ఎగురవేసేందుకు వెళ్లాడు. అతను కూడా ప్రమాదవశాత్తూ మేడ పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు.

ప్రాణాలు తీసిన గాలిపటాలు.. - వేర్వేరుచోట్ల నలుగురు మృతి
X

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేయాలనే సరదా నాలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వేర్వేరు ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేస్తుండగా ప్రమాదాలకు గురై నలుగురు చిన్నారులు మృతిచెందారు. వీరిలో పలువురు గాలిపటాలు ఎగురవేస్తూ భవనాల పైనుంచి పడిపోయి మృతిచెందడం శోచనీయం. ఈ ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

పేట్‌బషీర్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎన్‌సీఎల్‌ కాలనీలో నివాసముంటున్న ఏఎస్‌ఐ రాజశేఖర్‌ కుమారుడు ఆకాశ్‌ ఆదివారం గాలిపటం ఎగురవేసేందుకు తాము నివాసం ఉంటున్న ఐదంతస్తుల భవనం పైకి వెళ్లాడు. గాలిపటం ఎగురవేస్తుండగా.. దానినే గమనిస్తూ.. కంట్రోల్‌ చేస్తూ.. భవనం చివరికి వచ్చేశాడు. ఆ విషయాన్ని గుర్తించకపోవడంతో ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

నాగోల్‌లో 8వ తరగతి చదువుతున్న శివప్రసన్న కూడా ఆదివారం తాము నివాసం ఉంటున్న నాలుగంతస్తుల మేడపైకి గాలిపటం ఎగురవేసేందుకు వెళ్లాడు. అతను కూడా ప్రమాదవశాత్తూ మేడ పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇక శనివారం అత్తాపూర్‌లో తనిష్క్‌ (11) అనే బాలుడు భవనంపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్న క్రమంలో కిందపడి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుబ్రహ్మణ్యం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. విద్యుత్‌ తీగలు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో జోహెల్‌ (12) అనే బాలుడు కరెంటు వైర్లలో చిక్కుకున్న గాలిపటాన్ని తీయబోయి విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

First Published:  15 Jan 2024 3:01 AM GMT
Next Story