Telugu Global
Telangana

100 రోజుల కాంగ్రెస్‌ పాలనలో.. 180 మంది రైతుల ఆత్మహత్య

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందన్నారు హరీశ్‌రావు. సీఎం, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదు, రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి, ఒక్క మంత్రి కూడా పరామర్శించిన పాపాన పోలేదన్నారు.

100 రోజుల కాంగ్రెస్‌ పాలనలో.. 180 మంది రైతుల ఆత్మహత్య
X

కాంగ్రెస్‌ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పూర్తిగా విఫలమైందన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఆయన పర్యటించారు. సాగునీళ్లు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతులు తమ బాధలను హరీశ్‌రావుకు చెప్పుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందన్నారు హరీశ్‌రావు. సీఎం, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదు, రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి, ఒక్క మంత్రి కూడా పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. అప్పుడు అరచేతిలో స్వర్గం చూపెట్టి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందన్నారు హరీశ్‌రావు.

"కాంగ్రెస్ ఒక్క రూపాయి రుణమాఫీ చేసింది లేదు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామన్నారు.. కానీ రూ.10 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు కొత్తగా బోర్లు వేసి అప్పుల పాలవుతున్నారు. రైతుబంధు కౌలు రైతులకు కూడా ఇస్తామని వాళ్లను కూడా మోసం చేసింది. రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు.. రెండు పంటలు పండాయి. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ అడుగడుగునా రైతులను మోసం చేసింది" అని రేవంత్ సర్కారుపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.

First Published:  24 March 2024 12:28 PM GMT
Next Story