Telugu Global
Telangana

క‌న్నతండ్రే క‌సాయిగా మారి.. - త‌న బిడ్డలిద్ద‌రినీ హ‌త‌మార్చిన దారుణం

పిల్లలను తీసుకొచ్చేందుకు పాఠశాలకు వెళ్లిన మార్తమ్మకు వాళ్ల నాన్న వచ్చి తీసుకెళ్లాడని తెలిసింది. అతడి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. అనుమానమొచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తాళం పగులగొట్టి చూడగా పిల్ల‌లిద్ద‌రూ విగ‌త జీవులుగా క‌నిపించారు.

క‌న్నతండ్రే క‌సాయిగా మారి.. - త‌న బిడ్డలిద్ద‌రినీ హ‌త‌మార్చిన దారుణం
X

క‌న్న‌తండ్రే క‌సాయిలా మారాడు. త‌న బిడ్డ‌లిద్ద‌రినీ తానే హ‌త‌మార్చాడు. భార్య‌తో నెల‌కొన్న విభేదాలే దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. సోమ‌వారం సాయంత్రం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆ త‌ల్లిని తీర‌ని శోకంలో ముంచేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన పార్శపు శివరామగోపాల్, మార్తమ్మ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శివరామగోపాల్ దొంగతనం కేసులో జైలుపాలై మూడు రోజుల కిందటే విడుదలయ్యాడు.

భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో మార్తమ్మ అదే గ్రామంలోని పుట్టింట్లో పిల్లలతో ఉంటోంది. ఆదివారం వారి మధ్య మళ్లీ గొడవైంది. వారి పిల్లలు పార్శపు రామకృష్ణ (8), ఆరాధ్య (6) రాయపట్నం ప్రభుత్వ పాఠశాలలో 3, 1 తరగతులు చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాల వద్దకు వెళ్లిన శివరామగోపాల్ వారిని తనతో తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం వారిని గొంతు నులిమి చంపి దుప్పట్లో మూటకట్టి పరారయ్యాడు.

పిల్లలను తీసుకొచ్చేందుకు పాఠశాలకు వెళ్లిన మార్తమ్మకు వాళ్ల నాన్న వచ్చి తీసుకెళ్లాడని తెలిసింది. అతడి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. అనుమానమొచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తాళం పగులగొట్టి చూడగా పిల్ల‌లిద్ద‌రూ విగ‌త జీవులుగా క‌నిపించారు. దీంతో ఆ త‌ల్లి గుండెల‌విసేలా రోదించింది. బిడ్డ‌లే జీవితంగా బ‌తుకుతున్న ఆమె వారే దూర‌మ‌య్యేస‌రికి క‌న్నీరుమున్నీరుగా విల‌పించింది.

సమాచారం అందుకున్న‌ శిక్షణ ఐపీఎస్ అధికారి ఎస్‌హెచ్ అవినాష్ కుమార్, సీఐ వసంతకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పిల్లల మృతదేహాలను మధిర ఆస్ప‌త్రికి తరలించగా అక్కడ వైరా ఏసీపీ రెహమాన్ పరిశీలించారు. గతంలో శివరామగోపాల్‌పై పలు దొంగతనాల కేసులు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అతని కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు.

First Published:  11 July 2023 2:57 AM GMT
Next Story