Telugu Global
Telangana

హైదరాబాద్ లో ‍'బయోలాజికల్ ఇ' విస్తరణ... 1800 కోట్ల నూతన పెట్టుబడి,కొత్తగా 2500 మందికి ఉపాధి

తెలంగాణ మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణకు పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. తాజాగా కేటీఆర్ చొరవతో 1800 కోట్ల పెట్టుబడితో నూతన ప్రాజెక్టును ప్రకటించింది 'బయోలాజికల్ ఇ' సంస్థ. దీనవల్ల కొత్తగా 2500 మందికి ఉపాధి లభించనుంది.

హైదరాబాద్ లో ‍బయోలాజికల్ ఇ విస్తరణ... 1800 కోట్ల నూతన పెట్టుబడి,కొత్తగా 2500 మందికి ఉపాధి
X

"వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్"గా ఉన్న హైదరాబాద్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తూ ఆ రంగంలో 1800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి 'బయోలాజికల్ ఇ' ముందుకొచ్చింది. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల ఈ రోజు సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.

1800 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ఈ సంస్థ తన కార్యకలాపాల విస్తరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రాథమికంగా ఈ సంస్థ జెనరిక్ ఇంజెక్టబుల్స్, R&Dతో పాటు వ్యాక్సిన్‌ల తయారీని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో 2518 మందికి ఉపాధి లభిస్తుంది.

ఇప్పటి వరకు వాక్సిన్ల తయారీలో హైదరాబాద్ సంవత్సరానికి 9 బిలియన్ డోస్ ల‌ ఉత్పత్తి తో ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ లలో మూడవ వంతు అందిస్తోంది. బయోలాజికల్ E ఉత్పత్తి చేయబోయే 5 బిలియన్ డోస్‌ల ద్వారా మొత్తం ఉత్పత్తి 14 బిలియన్ డోస్‌లకు పెరుగుతుంది.

జాన్‌సెన్ కోవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పిసివి వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, ఐపివి వ్యాక్సిన్, పెర్టుసిస్ వ్యాక్సిన్, బయోలాజికల్ ఎపిఐలు , ఫార్ములేషన్‌లు, సిఆర్‌ఐఎన్‌1 జెనరిక్ ఇంజెక్ట్‌తో కూడిన స్పెషాలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రధానంగా బయోలాజికల్ ఇ పెట్టుబడులు కేంద్రీకరించబడుతాయి.

ఈ సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జీనోమ్ వ్యాలీలో 'బయోలాజికల్ ఇ' విస్తరణ ప్రణాళికలను ప్రకటించినందుకు ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్‌ను ఇప్పటికే "వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్" అని పిలుస్తారని, 'బయోలాజికల్ ఇ' ఈ నూతన విస్తరణ వల్ల వ్యాక్సిన్ రంగంలో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దూర దృష్టికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని బయోలాజికల్ ఇ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల అన్నారు. ఈ కరోనా మహమ్మారి కాలంలో కూడా తమ సంస్థ విస్తరణ ప్రణాళికలు సులభతరం అయ్యేవిధంగా సహకరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారామె.

First Published:  21 July 2022 8:34 AM GMT
Next Story