Telugu Global
Telangana

టాలీవుడ్ లో కలకలం.. హీరో నవదీప్ కి ఈడీ నోటీసులు

సెప్టెంబర్ 14న గుడిమల్కాపూర్ లో మరోసారి డ్రగ్స్ బయటపడటంతో పోలీసులు మళ్లీ లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు. సినీ మూలాలు కనిపెట్టారు. నార్కోటిక్ బ్యూరో విచారణ తర్వాత ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది.

టాలీవుడ్ లో కలకలం.. హీరో నవదీప్ కి ఈడీ నోటీసులు
X

హీరో నవదీప్ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులతో టాలీవుడ్ లో మరోసారి కలకలం రేగింది. మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో ఇటీవలే నవదీప్‌ ను నార్కోటిక్‌ బ్యూరో విచారించింది. నవదీప్ ఇంట్లో కూడా నార్కోటిక్ బ్యూరో సోదాలు జరిపింది. విచారణ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టింది. తాజాగా ఈడీ నోటీసులతో మరోసారి నవదీప్ డ్రగ్స్ వ్యవహారం హైలైట్ అవుతోంది.

గతంలో కూడా టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు కానీ, ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు, నిందితులుగా పేర్కొనలేదు. అప్పట్లో సిట్, ఈడీ కూడా ఈ వ్యవహారంలో విచారణ జరిపాయి. తాజాగా సెప్టెంబర్ 14న గుడిమల్కాపూర్ లో మరోసారి డ్రగ్స్ బయటపడటంతో పోలీసులు మళ్లీ లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు. సినీ మూలాలు కనిపెట్టారు. నార్కోటిక్ బ్యూరో విచారణ తర్వాత ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది.

ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా..

డ్రగ్స్ ని భారత్ లో కి తీసుకు రావాలంటే విదేశీయుల సహకారం తప్పనిసరి. ఆ సందర్భంగా వారితో జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆ తర్వాత దేశీయంగా జరిగే లావాదేవీలపై ఈడీ దృష్టిసారించింది. గతంలో నవదీప్ ని ఓసారి ఈడీ విచారణకు పిలిచింది. ఇప్పుడు మరోసారి నోటీసులిచ్చింది. హైదరాబాద్ లో డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడటం సహజం. ఈసారి వ్యవహారం మళ్లీ ఈడీ వరకు వెళ్లడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది.

First Published:  7 Oct 2023 3:41 AM GMT
Next Story