Telugu Global
Telangana

మళ్లీ ఈడీ నోటీసులు.. కవిత వెళ్తారా..?

గతంలోనూ కవితను మూడు సార్లు ఈడీ విచారించింది. అయితే ఈడీ నోటీసులు, విచారణ పద్ధతిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈడీ ఆఫీసులో మహిళలను విచారించ‌డం సరికాదంటూ వాదించారు.

మళ్లీ ఈడీ నోటీసులు.. కవిత వెళ్తారా..?
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడీ తన నోటీసుల్లో స్పష్టం చేసింది. కవితకు ఈడీ నోటీసులతో తెలంగాణలో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

గతంలోనూ కవితను మూడు సార్లు ఈడీ విచారించింది. అయితే ఈడీ నోటీసులు, విచారణ పద్ధతిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈడీ ఆఫీసులో మహిళలను విచారించ‌డం సరికాదంటూ వాదించారు. నళిని చిదంబరం తరహాలోనే తననూ ఇంటి దగ్గరే విచారించాలని డిమాండ్ చేశారు. ఇక కవిత పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు మహిళ అయినంత మాత్రాన విచారించొద్దని చెప్పలేమని అభిప్రాయపడింది. అయితే మహిళల విషయంలో కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరీ విచారణకు కవిత హాజరవుతారా..? లేదా..? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తాజా నోటీసులపై కవిత ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  15 Jan 2024 2:39 PM GMT
Next Story