Telugu Global
Telangana

సెల్ఫీ ప్రియులకు ఈసీ షాక్.. నిబంధనలు ఇవే

తొలిసారి ఓటు హక్కు పొందినవారు ఓటు వేసే విషయంలో ఉత్సాహంగా ఉంటారు. యువతీ యువకులు తాము ఓటు వేసి వేలికి ఉన్న సిరా చుక్కను చూపెడుతూ ఫొటో దిగి సోషల్ మీడియాలో పెడుతుంటారు.

సెల్ఫీ ప్రియులకు ఈసీ షాక్.. నిబంధనలు ఇవే
X

తొలిసారి ఓటు హక్కు పొందినవారు ఓటు వేసే విషయంలో ఉత్సాహంగా ఉంటారు. యువతీ యువకులు తాము ఓటు వేసి వేలికి ఉన్న సిరా చుక్కను చూపెడుతూ ఫొటో దిగి సోషల్ మీడియాలో పెడుతుంటారు. దీని కోసం కొంతమంది పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకెళ్తుంటారు. మరికొందరు పోలింగ్ బూత్ లో తాము ఓటు వేసే సమయంలో ఫొటో దిగాలనుకుంటారు. వీఐపీలు ఓటు వేస్తుంటే ఫొటోలు తీయడానికి మీడియావాళ్లు ఉంటారు కానీ.. సామాన్యుల విషయంలో ఇలాంటి ఫొటోలు బయటకు రావడం అరుదు. ఎవరికి వారే ఇలాంటి ప్రయత్నాలు చేయడం కూడా తప్పు అని అంటోంది ఎన్నికల సంఘం. ఎన్నికల వేళ సెల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.

గతంలో ఉన్న నిబంధనే అయినా.. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ల విషయంలో నిబంధనలు కఠినంగా పాటిస్తున్నారు పోలింగ్ అధికారులు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకు రావొద్దు అని ముందుగానే స్పష్టం చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఒకవేళ ఎవరైనా పోలింగ్ కేంద్రానికి సెల్ ఫోన్ తెస్తే.. బయటే వాటిని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓటు వేసి వచ్చిన తర్వాత వాటిని కలెక్ట్ చేసుకోవాలి. అంటే పోటీ పరీక్షకు అభ్యర్థులు హాజరైనంత పగడ్బందీగా నియమాలు ఉన్నాయి. ఓటు వేసేటప్పుడు సెల్ఫీ తీసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఒకవేళ సెల్ఫీకి ప్రయత్నిస్తే పోలీస్ కేసు ఎదుర్కోవాల్సిందే.

సెల్ ఫోన్‌ ను పోలింగ్ క్రేంద్రంలోకి అక్రమంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసినా పోలీస్ కేసు నమోదవుతుంది. అంతేకాదు, వారు వేసిన ఓటుని కూడా పరిగణలోకి తీసుకోరు. సెల్ఫీ తీసుకున్నా కూడా కేసు పెడతారు. పోలింగ్ కేంద్రంలోకి కెమెరాలు కూడా తీసుకెళ్లకూడదు, ఫొటోలు తీయకూడదు, ల్యాప్ టాప్‌ లు కూడా తీసుకుపోవడానికి కుదరదు. ఓటు వేసేందుకు ఓటరు స్లిప్ తో పాటు, ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో.. యువ ఓటర్లు సెల్ఫీ విషయంలో అత్యుత్సాహం చూపిస్తే పోలీస్ కేసు ఎదుర్కోక తప్పదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

First Published:  29 Nov 2023 5:18 AM GMT
Next Story