Telugu Global
Telangana

మెట్రో టికెట్ ధరలు పెంచొద్దు.. హెచ్ఎంఆర్ఎల్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక

హైదచాబాద్‌లో కొత్త మెట్రో రైల్ మార్గానికి అవసరమైన నిధులు అందించకుండా కేంద్రం పనులకు మోకాలడ్డుతోందని ఆయన విమర్శించారు.

మెట్రో టికెట్ ధరలు పెంచొద్దు.. హెచ్ఎంఆర్ఎల్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
X

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులకు మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో తిరుగుతున్న మెట్రో రైలు టికెట్లను ఇష్టానుసారం పెంచితే ఊరుకోబోయేది లేదని ఇప్పటికే అధికారులను హెచ్చరించినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. శనివారం అసెంబ్లి క్వశ్చర్ హవర్‌లో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఆర్టీసీతో సమానంగా మెట్రో చార్జీలు ఉండాలని ఇప్పటికే సూచించినట్లు కేటీఆర్ తెలిపారు.

హైదచాబాద్‌లో కొత్త మెట్రో రైల్ మార్గానికి అవసరమైన నిధులు అందించకుండా కేంద్రం పనులకు మోకాలడ్డుతోందని ఆయన విమర్శించారు. దేశంలోని చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో రైళ్ల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతోందని ఆయన ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించ తలపెట్టిన ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలోనే పూర్తి చేసేలా కార్యచరణ సిద్ధం చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.

హైదరాబాద్ అంటే చార్మినార్ అనే సంగతి అందరికీ తెలుసని.. దానికి ఎలాంటి ఆటంకం లేకుండా పాత బస్తీలో మెట్రో పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్త శుద్దితో ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఎన్ని అధునాతన భవంతులు వెలిసినా.. హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదని మంత్రి స్పష్టం చేశారు. గుల్జార్‌హౌస్, మీర్-ఆలం మండీ, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొని వస్తామని కేటీఆర్ చెప్పారు. మదీనా నుంచి పత్తర్‌గట్టి వరకు నిర్మిస్తున్న పాదబాట పనులు పూర్తి కావొచ్చాయన్నారు. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు కూడా చేపట్టినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 35 పనులకు గాను 11 పూర్తి చేశామని తెలిపారు. ఇక పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకు గాను రెండు పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. స్ట్రాటజిక్ నాలా డెవలెప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్‌డీపీ) దేశంలో ఏ నగరంలో కూడా లేదని తెలిపారు. ఎల్బీనగర్‌లోని కొన్ని కాలనీల్లో గత వార్షాకాలంలో కొంత ముంపు సమస్య తగ్గిందని తెలిపారు.

First Published:  11 Feb 2023 9:13 AM GMT
Next Story