Telugu Global
Telangana

కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోంది.. అందుకే బీఆర్ఎస్ లోకి

మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు డాక్టర్ చెరుకు సుధాకర్. ఆయనతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరికొందరు కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోంది.. అందుకే బీఆర్ఎస్ లోకి
X

కాంగ్రెస్ పార్టీ బీసీలను అవమానిస్తోందని, అందుకే బీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పారు డాక్టర్ చెరుకు సుధాకర్. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్ పీసీసీ ఉపాధ్యక్షుడుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నేతల తీరును నిరసిస్తూ ఆయన నిన్న పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు.


ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని అన్నారు డాక్టర్ చెరుకు సుధాకర్. కాంగ్రెస్‌ పార్టీలో డబ్బులున్నన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారికే ప్రాధాన్యం ఉంటుందని, మధుయాష్కీ వంటి బీసీల నేతల స్థాయిని తగ్గిస్తూ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు సుధాకర్. కాంగ్రెస్‌ చెప్తున్న సామాజిక న్యాయం కేవలం రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ మాటల్లో మాత్రమే కనపడుతుందని, ఆ పార్టీ ఆచరణలో అది లేదన్నారు.

సీట్ల విషయంలో మోసం..

ఉదయపూర్‌ డిక్లరేషన్‌ ప్రకారం బీసీలకు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ చివరకు మోసం చేసిందని ఆరోపించారు డాక్టర్ సుధాకర్. బీసీలకు కేటాయించామంటున్న 12 సీట్లలో ఐదు చోట్ల ఎప్పుడూ కాంగ్రెస్‌ కు డిపాజిట్‌ రాలేదని.. అలాంటి సీట్లను ఏరికోరి బీసీలకు ఇచ్చారని మండిపడ్డారు. బీసీలకు 12 సీట్లు ఇచ్చామంటూ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గొప్పగా చెప్పడం వెక్కిరింపు కాక ఇంకోటి కాదన్నారు.

పొన్నాలకు అవమానం..

సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను అవమానించి పార్టీకి దూరం చేసుకున్నారని చెప్పారు డాక్టర్ చెరుకు సుధాకర్. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా సమయంలో రేవంత్‌ రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాలకే కాదని కాంగ్రెస్ లో ఉన్న బీసీనేతలందరి పరిస్థితి అంతేనన్నారు.


First Published:  21 Oct 2023 12:54 PM GMT
Next Story