Telugu Global
Telangana

మైనార్టీలకు ఈ నెల 16 నుంచి రూ.1 లక్ష చెక్కుల పంపిణీ : మంత్రి హరీశ్ రావు

ప్రతీ నియోజకవర్గంలో దామాషా ప్రకారం రూ.1 లక్ష ఆర్థిక సాయం లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని మంత్రి చెప్పారు.

మైనార్టీలకు ఈ నెల 16 నుంచి రూ.1 లక్ష చెక్కుల పంపిణీ : మంత్రి హరీశ్ రావు
X

మైనార్టీల సంక్షేమంలో భాగంగా వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తులు అధికారులు స్వీకరించారు. అర్హులైన 10వేల మంది లబ్దిదారులకు ఈ నెల 16 నుంచి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీలకు ఆర్థిక సాయం, ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్స్, క్రిస్టియన్ స్మశాన వాటికలు, మౌజంల సంఖ్య పెంపు తదితర అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

రాష్ట్రంలోని అన్ని వర్గాలతో సమానంగా మైనార్టీ వర్గాల సంక్షేమం పట్ల కూడా సీఎం కేసీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే స్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజమ్‌ల సంఖ్య పెంపు వంటి హామీలను ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వ మొత్తం రూ.400 కోట్లు కేటాయించిందని మంత్రి చెప్పారు.

ప్రతీ నియోజకవర్గంలో దామాషా ప్రకారం రూ.1 లక్ష ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని మంత్రి చెప్పారు. మైనార్టీల జనాభా ఎక్కువగా ఉండే నియోజకవర్గాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై అధికారులతో ఒక సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో శ్మశాన వాటికలు, ఈద్గాల భూముల కోసం వచ్చిన మొత్తం వినతులను క్రోడీకరించాలని అధికారులకు సూచించారు.

ఓవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హానా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర పనులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను వెంటన విడుదల చేయాలని అధికారులను కోరారు.

షాదీ ముబారక్ ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు వెంటనే సొమ్ము అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు మహబూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యుటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.


First Published:  8 Aug 2023 11:29 AM GMT
Next Story