Telugu Global
Telangana

దిశా కేసు: సజ్జనార్ కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు

ఈ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసు అధికారుల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, నలుగురు నిందితుల మరణానికి దారితీసిన పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వివరణాత్మక, న్యాయమైన దర్యాప్తును నిర్వహించిందని అన్నారు.

దిశా కేసు: సజ్జనార్ కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు
X

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ దిశా కేసుకు సంబంధించి సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సహా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పది మంది పోలీసులకు బుధవారం నోటీసులు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసు అధికారుల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, నలుగురు నిందితుల మరణానికి దారితీసిన పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వివరణాత్మక, న్యాయమైన దర్యాప్తును నిర్వహించిందని అన్నారు. మరియు CrPC సెక్షన్ 173 కింద సంబంధిత మేజిస్ట్రేట్ ముందు తుది నివేదిక దాఖలు చేశారని, ఇది పరిశీలనలో ఉందని తెలిపారు.పోలీసుల వాదనలు వినకుండా ఓ నిర్ణయానికి రావద్దని, అసలు ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు నోటీసులే ఇవ్వలేదని తెలిపారు. జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదిక కోర్టు ప్రొసీడింగ్స్‌కు ప్రత్యామ్నాయం కాదని, కమిషన్‌ నివేదికల ఆధారంగా క్రిమినల్‌ కేసుల్లో శిక్షలు పడవని పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్‌పై పిటిషన్ల దాఖలు చేసిన ప్రజాసంఘాలు, ఇతర పిటిషనర్ల తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది వ్రిందా గ్రోవర్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తన వాదన వినిపించకుండా ఇతరులతో పిటిషన్లు వేయిస్తోందని, ఇదంతా కేసును తప్పుదోవ పట్టించే వ్యవహారంలా కనిపిస్తోందన్నారు. కాగా కేసు విచారణ ఈనెల 21కి వాయిదా పడింది.

First Published:  13 April 2023 2:12 AM GMT
Next Story