Telugu Global
Telangana

బండికి గుండు.. చెప్పులు మోసినా ఫలితం లేదు

అధ్యక్ష పదవి తీసేసే సమయంలో అసంతృప్తి లేకుండా చూసేందుకు అధిష్టానమే కేంద్ర మంత్రి పదవి అంటూ లీకులిచ్చిందా అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం బండి వర్గంలో తీవ్ర నిరాశ మిగిల్చింది.

బండికి గుండు.. చెప్పులు మోసినా ఫలితం లేదు
X

5 రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చడం బీజేపీలో సాధారణ విషయమే. అయితే తెలంగాణకు సంబంధించి బండి సంజయ్ ని తీసి పక్కనపెట్టడాన్ని మాత్రం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతెందుకు బండికి కూడా ఇది మింగుడు పడని వ్యవహారమే. అందుకే ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో బీజేపీ కార్యకర్త అంటూ ట్యాగ్ లైన్ మార్చేసుకున్నారు. తన అసంతృప్తిని అలా బయటపెట్టారు. ఇక బండి అభిమానులైతే సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేవలం ఈటలను సంతృప్తి పరిచేందుకే అధిష్టానం బండిని పక్కకు తప్పించిందని, కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చినా, ఈటల పెత్తనం కొనసాగుతుందని అంటున్నారు.

చెప్పులు మోసినా..

గతంలో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద.. అమిత్ షా చెప్పుల్ని మోశారంటూ బండిపై తీవ్ర దుమారం రేగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాత్ కాళ్ల దగ్గర పెడతారా అంటూ మండిపడ్డాయి వైరి వర్గాలు, అవేవీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. బహిరంగ సభలో మోదీని దేవుడంటూ కీర్తించడం కూడా విమర్శకులకు బాగా పనిచెప్పింది. అప్పట్లో మోదీ భుజం తట్టాడని బండి వర్గం గొప్పలు చెప్పుకున్నా, ఇప్పుడిలా అధ్యక్ష పదవిని తీసేయడంతో వారు డీలా పడ్డారు. విజయశాంతి కూడా బండి సంజయ్ వ్యవహారంలో బాధపడ్డారు. పార్టీకోసం అందర్నీ తిట్టి, వారితో తిట్టించుకున్న బండి, చివరికిప్పుడు పక్క పార్టీనుంచి వచ్చిన ఈటల పెత్తనంలో పనిచేయాల్సి వస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ పదవి ఇస్తే..

ఇక బండికి కేంద్రంలో పదవి ఇస్తారనే ప్రచారం మాత్రం కొనసాగుతోంది. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి తీసేస్తే, బండికి అవకాశం ఉంటుంది. కిషన్ రెడ్డికి ఆ పదవి కొనసాగిస్తే మాత్రం బండికి గుండు సున్నా చుట్టేసినట్టే. అధ్యక్ష పదవి తీసేసే సమయంలో అసంతృప్తి లేకుండా చూసేందుకు అధిష్టానమే కేంద్ర మంత్రి పదవి అంటూ లీకులిచ్చిందా అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం బండి వర్గంలో తీవ్ర నిరాశ మిగిల్చింది.

First Published:  5 July 2023 12:35 AM GMT
Next Story