Telugu Global
Telangana

డర్టీ రోగ్ రాజకీయాలు.. ఆకునూరి మురళి ట్వీట్‌ రేవంత్ గురించేనా?

ఇంతలోనే రేవంత్‌ ప్రభుత్వంపై ఆకునూరి మురళికి ఎందుకింత కోపమొచ్చింది?. రేవంత్‌తో ఎక్కడ చెడింది?. గతంలో కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించినట్లుగానే ఇప్పుడు రేవంత్‌పైనా దాడి మొదలుపెడుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

డర్టీ రోగ్ రాజకీయాలు.. ఆకునూరి మురళి ట్వీట్‌ రేవంత్ గురించేనా?
X

మాజీ IAS ఆఫీసర్ ఆకునూరి మురళి ట్వీట్‌ పొలిటికల్ సర్కిల్లో హాట్‌టాపిక్‌గా మారింది "దశాబ్దం పాటు రాజ్యాంగ విలువలు, విద్య, అవినీతి గురించి ప్రసంగాలు దంచి.. అధికారంలోకి రాగానే డర్టీ రోగ్ రాజకీయాలు చేస్తుంటే చూడడానికి అసహ్యం కలుగుతోంది" అంటూ ఆకునూరి మురళి చేసిన ట్వీట్‌ ఆసక్తికర చర్చకు దారి తీసింది. సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించే ఆకునూరి మురళి ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్‌ సర్కారు అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్న వ్యక్తుల్లో ఆకునూరి మురళి కూడా ఒక్కరు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన జాగో తెలంగాణ బస్సు యాత్రలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా రేవంత్‌ సర్కారు అధికారంలోకి రావడానికి తనవంతు సాయం చేశారు ఆకునూరి మురళి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్పీ ఛైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, ఇంతలోనే రేవంత్‌ ప్రభుత్వంపై ఆకునూరి మురళికి ఎందుకింత కోపమొచ్చింది?. రేవంత్‌తో ఎక్కడ చెడింది?. గతంలో కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించినట్లుగానే ఇప్పుడు రేవంత్‌పైనా దాడి మొదలుపెడుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆకునూరి మురళి ట్వీట్‌.. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను ఉద్దేశించి చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్‌ BRSలో చేరడాన్ని ఆయన ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్ఎస్‌ ప్రవీణ్‌నే టార్గెట్ చేసి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.


కొంత కాలంగా విద్యా, వైద్య రంగాలపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు ఆకునూరి మురళి. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించి పేదలు, ఆదివాసీల మన్ననలు పొందారు. కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసి స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు. ఆకునూరి ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలో ఆయన సేవలను వినియోగించుకుంది. విద్య, మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా నియమించింది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన ఏపీలో మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. పిల్లలకు ఇంగ్లీషు మీడియం అమలునూ విజయవంతం చేయగలిగారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో మన ఊరు–మన బడి కార్యక్రమాన్నిఇంప్లిమెంట్ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ సమయంలోనూ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ లోపాలను ఎత్తి చూపారు.

First Published:  19 May 2024 9:33 AM GMT
Next Story