Telugu Global
Telangana

ప్రజలపై దిల్ రాజు కేసు.... భగ్గుమంటున్న 'బలగం' మూవీ ఫ్యాన్స్

బలగం మూవీ ఇంతగా ప్రజల్లోకి వెళ్ళి , డబ్బుల వర్షం కూడా కురిపించినప్పటికీ ఈ మూవీ నిర్మాత దిల్ రాజుకు మాత్రం కోపం వచ్చింది. ప్రజలు గ్రామాల్లో తెరలపై వేసుకొని మూవీ చూడటాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ప్రజలు అలా చేస్తే తన ఆదాయం దెబ్బతింటున్నదని ఏకంగా పోలీసు కేసే పెట్టేశాడు.

ప్రజలపై దిల్ రాజు కేసు.... భగ్గుమంటున్న బలగం మూవీ ఫ్యాన్స్
X

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన మూవీ 'బలగం'. తెలంగాణ ప్రాంత ప్రజల, సంస్కృతి, సాంప్రదాయాలు, అభిమానాలు, కోపాలు, పట్టుదలలు...ఇలా అన్నింటినీ వెండితెరమీద ఆవిష్కరించిన బలగం మూవీ అటు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఇప్పటికీ బాగా నడుస్తోంది. అనేక తెలంగాణ పల్లెల్లో ప్రజలు కచ్చీర్ల దగ్గర 16ఎమ్ ఎమ్ తెరలపై ఆ మూవీ వేసుకొని చూస్తున్నారు. మరో వైపు ఈ మూవీ జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కూడా కొల్లగొడుతోంది.

మూవీ ఇంతగా ప్రజల్లోకి వెళ్ళి , డబ్బుల వర్షం కూడా కురిపించినప్పటికీ ఈ మూవీ నిర్మాత దిల్ రాజుకు మాత్రం కోపం వచ్చింది. ప్రజలు గ్రామాల్లో తెరలపై వేసుకొని మూవీ చూడటాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ప్రజలు అలా చేస్తే తన ఆదాయం దెబ్బతింటున్నదని ఏకంగా పోలీసు కేసే పెట్టేశాడు.

ప్రజలు గ్రామాల్లో బలగం మూవీ తెరలపై వేసుకొని చూడటం నేరమని, దాన్ని వెంటనే అడ్డుకోవాలని, అలా చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దిల్ రాజు టీం నిజామాబాద్, కామారెడ్డి ఎస్పీలకు పిర్యాదు చేశారు. వాళ్ళు అలా చేయడం వల్ల తన ఆదాయాలని గండిపడుతున్నదని ఆయన తన పిర్యాదులో పేర్కొన్నాడు.

దిల్ రాజు పిర్యాదు విషయంపై సోషల్ మీడియాలో నెటిజనులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఆ మూవీపై పెట్టిన పెట్టుబడికన్నా దిల్ రాజుకు ఎక్కువ డబ్బే వచ్చిందని, ప్రజలు ఆ మూవీలో తమ జీవితాలను చూసుకుంటూ, వేల మంది ఆ మూవీని చూస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి పోలీసు కేసు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు.

అనేక సినిమాలను పైరసీ చేసి ఆన్ లైన్ లో రిలీజ్ చేసినవాళ్ళను ఏమీ చేయలేని వారు ప్రజలు గ్రామాల్లో చూస్తే మాత్రం కేసులు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

First Published:  3 April 2023 1:38 PM GMT
Next Story