Telugu Global
Telangana

తెలంగాణకు అన్యాయం....'ధోఖే బాజ్ మోడీ' ట్విట్టర్ లో ట్రెండింగ్

తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం చూపిస్తున్న వివక్ష, ప్రజలకు అత్యవసరమైన‌ వస్తువులపై పెంచిన జీఎస్టీ... తదితర విషయాలపై ఇవ్వాళ్ళ ట్విట్టర్లో నెటిజనులు మోడి సర్కార్ పై విమర్ష‌ల వర్షం కురిపించారు. 'ధోఖే బాజ్ మోడీ' అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాళ్ళ‌ ట్విట్టర్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా ఉంది.

తెలంగాణకు అన్యాయం....ధోఖే బాజ్ మోడీ ట్విట్టర్ లో ట్రెండింగ్
X

పాలు, పాల ఉత్పత్తులతో సహా ప్రజలకు అత్యవసరమైన అనేక వస్తువుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి జీఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో టీఆరెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆందోళనలు చేపట్టాలని టీఆరెస్ శ్రేణులను టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కోరిన నేపథ్యంలో రోడ్ల మీద నిరసనలు తెలియజేయడమే కాక సోషల్ మీడియాలో కూడా నెటిజనులు ప్రధాని మోడీ పై విరుచుకపడుతున్నారు.

తెలంగాణకు ప్రధాని మోడి అన్యాయం చేశారంటూ 'ధోఖే బాజ్ మోడీ' హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. తెలంగాణ వరదలతో అతలాకుతలమవుతూ ఉంటే మోదీ కనీసం పట్టించుకోవడం లేదని అదే గుజరాత్ కైతే వేల కోట్లు ఇస్తారా అంటూ నెటిజనులు విమర్షలు గుప్పిస్తున్నారు. 'ధోఖే బాజ్ మోడీ' అనే హ్యాష్ ట్యాగ్ దాదాపు 70 వేల ట్వీట్లతో ట్విట్టర్ లో నెంబర్ 1 ట్రెండ్ గా కొనసాగుతోంది.

''గుజరాత్ కు వరదలు వస్తే ఆగమేఘాల మీద వేలకు వేల కోట్లను ప్రకటిస్తారు. తెలంగాణకు ఎందుకు ప్రకటించరు ?

మోడీ గారు, మీరు ఒక్క గుజరాత్ రాష్ట్రానికే ప్రధానమంత్రా..? లేదా దేశం మొత్తానికా ?'' అని టీఆరెస్ ఎమ్మెల్యే జోగు రామన్న ట్వీట్ చేయగా

''సావు స్మశానవాటికల్లో కాదు ఇంట్లో చేసుకోవాలి'' అని వైఎస్సార్ అనే నెటిజన్ అంత్యక్రియలపై జీఎస్టీ వేయడాన్ని విమర్షిస్తూ వ్యంగ్యంగా స్పందించారు.

''తన గొప్ప‌ స్నేహితుడైన అదానీని ప్రపంచంలో 4వ ధనవంతుడిగా చేయడానికి రోజుకు 18 గంటలు పనిచేసిన వ్యక్తి ఎవరో ఊహించండి ?

భారత ఆర్థిక వ్యవస్థను రికార్డు కనిష్ట స్థాయికి నెట్టివేస్తూ, టాప్ టెన్ లిస్ట్‌లో చేరేందుకు మీ స్నేహితుడికి సహాయం చేసినందుకు అభినందనలు నరేంద్రమోదీ.'' అని టీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు.

''గుజరాత్ కే సాథ్, తెలంగాణ కే ఖిలాఫ్ మోడల్ !'' అంటూ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక చేసిన ప్రజావ్యతిరేక చర్యలను వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు పుట్టా విష్ణు వర్ధన్ రెడ్డి అనే మరో నెటిజన్.

మోదీ తెలంగాణకు మోసం చేశాడంటూ... ''స్మార్ట్ సిటీ మిషన్ లో తెలంగాణకు నో ఫండ్స్, ఎన్డీఆరెఫ్ కింద తెలంగాణకు నో ఫండ్స్, తెలంగాణకు వరదలొస్తే నో ఫండ్స్, మిషన్ భగీరథ కు నో ఫండ్స్ .... మోడీ కాదు 'నో' డీ'' అంటూ టీఆరెస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఓ ఇమేజ్ పోస్ట్ చేశారు.

''గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ నగరాల పేర్లు మార్చడం కాదు, నగరాలను పునర్నిర్మించడం, అన్ని సదుపాయాలు కల్పించడం ఇప్పుడు అవసరం. అందులో మీరు విఫలమయ్యారు, దయచేసి దిగిపోండి.'' అని కామెంట్ చేసిన రావుల్ శ్రీధర్ రెడ్డి అనే నెటిజన్ గుజరాత్ పట్టణాల్లో గుంతలతో నిండిన రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న మురుగు నీటి వ్యవస్థ ఇమేజ్ లను పోస్ట్ చేశారు.

మొత్తానికి ఈ రోజు ట్విట్టర్ ప్రధాని మోడిపై విమర్షలతో మోత మోగుతోంది. తెలంగాణకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి ట్విట్టర్ లో జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. క్షణ క్షణానికి పెరుగుతున్న ట్వీట్లతో ఉదయం నుండి 'ధోఖే బాజ్ మోడీ' హ్యాష్ ట్యాగ్ నెంబర్ 1 గా నిలిచింది.

First Published:  20 July 2022 8:10 AM GMT
Next Story