Telugu Global
Telangana

'ధరణి' విషయంలో బీజేపీ ఢిల్లీ నాయకులది రెండు నాల్కల ధోరణి : మంత్రి హరీశ్ రావు

ధరణి విషయంలో బీజేపీ గల్లీ నాయకులు ఒకటి చెప్తే.. ఢిల్లీ నాయకులు మరొకటి చెప్తారని ఎద్దేవా చేశారు.

ధరణి విషయంలో బీజేపీ ఢిల్లీ నాయకులది రెండు నాల్కల ధోరణి : మంత్రి హరీశ్ రావు
X

ధరణి పోర్టల్ విషయంలో బీజేపీది రెండు నాల్కల ధోరణిగా ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు అభివర్ణించారు. ధరణి విషయంలో బీజేపీది పూటకో మాట, నోటికో మాట చందంగా తయారయ్యిందని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. దీనిపై మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ధరణి విషయంలో బీజేపీ గల్లీ నాయకులు ఒకటి చెప్తే.. ఢిల్లీ నాయకులు మరొకటి చెప్తారని ఎద్దేవా చేశారు. ధరణిని రద్దు చేయబోమని రాష్ట్ర బీజేపీ నాయకులు ఇటీవలే వ్యాఖ్యానించారు.. కానీ ఆ పోర్టల్ రద్దు చేస్తామని జేపీ నడ్డా అంటున్నారు. బీజేపీ రెండు నాల్కల ధోరణికి ఇది మరొక నిదర్శనం అని విమర్శించారు.

బీజేపీ పార్టీలో నేతల మధ్య సుతి కలవదు.. ఒకరి మాట మరొకరు వినరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు అయితే ధరణి గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా.. గుడ్డిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సుతి లేని బీజేపీకి.. మతి లేని కాంగ్రెస్ తోడయ్యిందని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో మండిపడ్డారు.

కాగా రాష్ట్రంలో రైతు బంధు పండగ మళ్లీ మందలైందని మంత్రి హరీశ్ రావు మరో ట్వీట్ చేశారు. రైతుల అభివృద్ధి, శ్రేయ‌స్సే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని, ఇవాళ తొలి రోజు సంద‌ర్భంగా 645.52 కోట్ల నిధుల‌ను రైతుల ఖాతాల్లోకి క్రెడిట్ చేస్తున్న‌ట్లు మంత్రి హ‌రీశ్ వెల్ల‌డించారు. జూన్ 26వ తేదీ రోజున సుమారు 22,55,081 మంది రైత‌ులకు రైతు బంధు అందిన‌ట్లు ఆయ‌న చెప్పారు.


First Published:  26 Jun 2023 2:41 PM GMT
Next Story