Telugu Global
Telangana

తొమ్మిదేళ్లలో మరే రాష్ట్రం సాధించని ప్రగతి తెలంగాణ సాధించింది - సీఎస్ శాంతి కుమారి

నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఆయా రంగాల్లో రికార్డు స్థాయిలో పురోగతి ఉందని వివరించారు.

తొమ్మిదేళ్లలో మరే రాష్ట్రం సాధించని ప్రగతి తెలంగాణ సాధించింది - సీఎస్ శాంతి కుమారి
X

తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఈ తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో దేశంలో మరే రాష్ట్రం సాధించని ప్రగతి సాధించిందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవంగా పాటించారు. ఈ సందర్బంగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఆయా రంగాల్లో రికార్డు స్థాయిలో పురోగతి ఉందని వివరించారు. 2014కు ముందు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడితో వాటర్ ట్యాంక్‌లకు కూడా పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వచ్చేదని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. గతంలో వేసవి కాలం వచ్చిందంటే జిల్లా కలెక్టర్లతో సహా ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లు రూపొందించేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు.

ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని, దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ ప్రణాళికలేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒక గొప్ప కార్యక్రమం అని, హరితహారంలో నాటిన దాదాపు 90 శాతం మొక్కలు పెరిగాయని, రాష్ట్రంలో ప్రసూతి మరణాలలో గణనీయమైన తగ్గుదల సాధించామని, రోగ నిరోధక శక్తి పెరిగిందని, వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు కనబడుతున్నాయని సీఎస్ శాంతి కుమారి తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను 21 రోజులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని, వీటికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని చెప్పారు. తన 34 ఏళ్ల సర్వీసులో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి గతంలో చూడలేదని, దీనికి కారణం, ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి అంకిత భావంతో పనిచేయడమేనని అన్నారు.

అంతకు ముందు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ కార్యదర్శులు తమ తమ శాఖలు సాధించిన విజయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలు, మార్పులపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి, వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక‌ మార్పులపై వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మున్సిపల్ పరిపాలన లో ప్రవేశ పెట్టిన టీ.ఎస్. బీపాస్‌పై మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, విద్యుత్ రంగంలో సంస్కరణలపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రాష్ట్రంలో ఆర్థిక రంగ సంస్కరణలపై ఆర్థిక, ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, విద్యా రంగంలో మార్పులపై విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్య, ధరణిలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఐటీ, పరిశ్రమల అభివృద్ధిపై ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ లు వివరించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్, ప్రిన్సిపల్ సీసీఎఫ్ దొబ్రీయల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీ లు, పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

First Published:  10 Jun 2023 2:27 PM GMT
Next Story