Telugu Global
Telangana

దశాబ్ది ఉత్సవాలపై సీఎస్ సమీక్ష.. వైభవంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సచివాలయ, జీహెచ్ఎంసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున సచివాలయంలోకి వారి ప్రవేశం, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.

దశాబ్ది ఉత్సవాలపై సీఎస్ సమీక్ష.. వైభవంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం
X

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర‌వింద్ కుమార్, సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సి.వీ.ఆనంద్ లతో సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ఆవరణలో మొట్ట మొదటిసారిగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నందున, ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా, పండగ వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని వివిధ శాఖల అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సచివాలయ, జీహెచ్ఎంసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున సచివాలయంలోకి వారి ప్రవేశం, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.

సెర్మోనియల్ పరేడ్ నిర్వహణ, జాతీయ పతాకావిష్కరణ ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నందున వారికి సరిపడా షామియానాలు, సీటింగ్, తదితర ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. బీ.ఆర్. అంబేద్కర్ సెక్రటేరియట్ తోపాటు రాజ్‌భవన్, అసెంబ్లీ ఇతర ప్రముఖ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని కోరారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి డెకరేషన్ చేపట్టాలని కోరారు. నగరంలోని చార్మినార్, క్లాక్ టవర్ తదితర ప్రముఖ భవనాలను ఉత్సవాలు జరిగే 21 రోజులపాటు విద్యుత్ దీపాలతో అలంకరించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశానికి హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, శ్రీనివాస రాజు, సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్.ఏ.ఎం. రిజ్వి, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, జైళ్ల శాఖ డీజీ, జలమండలి ఎండి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, ఈ.ఎన్.సి గణపతి రెడ్డి తదితరులు హాజరయ్యారు.

First Published:  24 May 2023 3:45 PM GMT
Next Story