Telugu Global
Telangana

ఆఫ్ఘనిస్థాన్‌ డ్రగ్‌ మాఫియాతో అదానీకి లింక్స్ ...సీపీఐ స‍ంచలన ఆరోపణ‌

అదానీ, అతని సోదరుడు వినోద్ అదానీలు తమ తొలినాళ్ల నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నారని, వారిపై గుజరాత్ పోలీసులు గతంలో కేసు కూడా నమోదు చేశారని సీపీఐ పేర్కొంది.

ఆఫ్ఘనిస్థాన్‌ డ్రగ్‌ మాఫియాతో అదానీకి లింక్స్ ...సీపీఐ స‍ంచలన ఆరోపణ‌
X

అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీకి ఆఫ్ఘనిస్థాన్‌ డ్రగ్‌ మాఫియాతో సంబంధాలున్నాయని, డ్రగ్స్‌ వ్యాపారం చేసేందుకు దేశంలోని ఓడరేవులను కొనుగోలు చేస్తున్నారని సీపీఐ సంచలన ఆరోపణలు చేసింది.

అదానీ, అతని సోదరుడు వినోద్ అదానీలు తమ తొలినాళ్ల నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నారని, వారిపై గుజరాత్ పోలీసులు గతంలో కేసు కూడా నమోదు చేశారని సీపీఐ పేర్కొంది. 2021లో అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడం అదానీకి ఆఫ్ఘనిస్థాన్ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయనడానికి నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.

బుధవారం మాజీ రాజ్యసభ సభ్యుడు, సీపీఐ సీనియర్ నేత అజీజ్ పాషాతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన‌ నారాయణ, డ్రగ్స్‌ను రోడ్ల ద్వారా రవాణా చేయడం కష్టం కాబట్టి,అదానీ వాటిని జలమార్గాల ద్వారా రవాణా చేయాలని నిర్ణయించుకున్నందున, దేశంలోని అన్ని ఓడరేవులను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇదంతా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు తెలియకుండా జరుగుతోందా? అని నారాయణ ప్రశ్నించారు. అదానీకి, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున ఎవరూ ప్రశ్నించడం లేదని ఆయన ఆరోపించారు.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై వ్యాఖ్యానించిన నారాయణ, మొత్తం వ్యవహారంపై విచారణకు కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సెబి, ఇతర ఏజెన్సీలు ఇప్పటివరకు చర్య తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదానీకి వ్యతిరేకంగా చర్య తీసుకోవద్దని వారికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయనడానికి ఇదే నిదర్శనమని ఆయన ఆరోపించారు.

First Published:  22 Feb 2023 2:47 PM GMT
Next Story