Telugu Global
Telangana

బిజెపికి వ్య‌తిరేకంగా ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాం - సిపిఐ ప్రదాన కార్య‌ద‌ర్శి రాజా

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాజా బుధ‌వారంనాడు హైద్రాబాద్ కు వచ్చారు. గురువారంనాడు ఆయన హైద్రాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని రాజా స్పష్టం చేశారు.

బిజెపికి వ్య‌తిరేకంగా ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాం - సిపిఐ ప్రదాన కార్య‌ద‌ర్శి రాజా
X

వ‌చ్చే సార్వ్ర‌తిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీని (బిజెపి) ని ఓడించేందుకు వామ‌ప‌క్షాలు గ‌ట్టి కృషి స‌లుపుతున్నాయ‌ని సిపిఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డి. రాజా చెప్పారు. 2024 ఎన్నికలు అత్యంత కీలకమైనవని, అందుకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను అద్య‌య‌నం చేస్తున్నామ‌ని చెప్పారు.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాజా బుధ‌వారంనాడు హైద్రాబాద్ కు వచ్చారు. గురువారంనాడు ఆయన హైద్రాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని రాజా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాన్ ఇండియన్ సెక్యులర్ పార్టీ అని ఆయన చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాల‌నే విషయాలపై రాష్ట్ర కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయని రాజా తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యం సరికాదన్నారు.దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, సీఎంలకు మధ్య చోటు చేసుకున్న వివాదాలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ‌,త‌మిళ‌నాడు రాష్ట్రాల‌లో గ‌వ‌ర్న‌ర్ల వ‌ద్ద‌కు వెళ్ళిన ప్ర‌భుత్వ ఫైళ్ళ ప‌రిష్కారంలో అనుచిత జాప్యం జ‌రుగుతోంద‌ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్న విష‌యాన్ని రాజా గుర్తు చేశారు. ప్ర‌భుత్వ విధుల్లో గ‌వ‌ర్న‌ర్ల జోక్యం త‌గ‌ద‌ని చెప్పారు. 2024 ఎన్నికల్లో దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గ‌ద్దె దించేందుకు వామ‌ప‌క్ష పార్టీలు గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని తెలిపారు. దీంతో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో లెఫ్ట్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయ‌న్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, బీజేపీయేతర పార్టీలతో చర్చలు జరుపుతున్నామ‌ని చెప్పారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడ విపక్ష పార్టీలు తమ అభ్యర్ధులను బరిలోకి దింపాయి. 2024 ఎన్నికల్లో కూడా విపక్ష పార్టీల కూటమిలో మరిన్ని పార్టీలు చేరేలా ప్రయత్నాలు చేస్తున్నామ‌న్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి సీపీఐ మద్దతును ప్రకటించింద‌ని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా బిజెపిని వ్య‌తిరేకించే శ‌క్తుల‌తో పార్టీల‌తో బ‌ల‌మైన ఐక్య కూట‌మిని ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని రాజా తెలిపారు.

First Published:  17 Nov 2022 1:50 PM GMT
Next Story