Telugu Global
Telangana

హీరో నితిన్ మామకు షాకిచ్చిన కాంగ్రెస్‌..!

నిజామాబాద్‌ రూరల్‌ స్థానంపై శుక్రవారం వరకు సస్పెన్స్ కొనసాగింది. ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు మండవ వెంకటేశ్వర రావును కలిశారు. పార్టీలోకి ఆహ్వానించారు.

హీరో నితిన్ మామకు షాకిచ్చిన కాంగ్రెస్‌..!
X

టాలీవుడ్‌ హీరో నితిన్‌ మేనమామ కాట్పల్లి నగేష్‌ రెడ్డికి షాకిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్న నగేష్‌ రెడ్డి నిజామాబాద్‌ రూరల్‌ టికెట్ దక్కుతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ప్రకటించిన జాబితాలో మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వడంతో నగేష్‌ రెడ్డి తీవ్ర నిరాశకు లోనయ్యారని సమాచారం. దాదాపు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తితో నగేష్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది.

నిజామాబాద్‌ రూరల్‌ స్థానంపై శుక్రవారం వరకు సస్పెన్స్ కొనసాగింది. ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు మండవ వెంకటేశ్వర రావును కలిశారు. పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయనకే నిజామాబాద్ రూరల్ స్థానం ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే మండవ పోటీకి నిరాకరించారా.. లేదా.. మరేదైనా జరిగిందో తెలియదు కానీ.. మాజీ ఎమ్మెల్సీ రేకులపల్లి భూపతిరెడ్డిని బరిలో నిలిపింది కాంగ్రెస్‌. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు భూపతిరెడ్డి. ఇక నిజామాబాద్ అర్బన్ స్థానం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి పోటీ చేస్తే.. షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

నిజామాబాద్ రూరల్‌ నుంచి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు బాజిరెడ్డి గోవర్ధన్. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి ఈసారి కొడుకును బరిలో దించాలని ఆలోచన చేసినప్పటికీ.. బీఆర్ఎస్ అధిష్టానం ఆయననే పోటీలో ఉంచింది. 2018లోనూ రేకులపల్లి భూపతిరెడ్డికే కాంగ్రెస్ అవకాశం ఇవ్వగా.. బాజిరెడ్డి దాదాపు 29 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

First Published:  28 Oct 2023 5:29 AM GMT
Next Story