Telugu Global
Telangana

అభ్యర్థులకు బాడీగార్డ్ లు.. కాంగ్రెస్ నిఘా మామూలుగా లేదు

గెలిచిన అభ్యర్థులను గట్టిగా పట్టుకోవడం కాంగ్రెస్ కి ప్రథమ కర్తవ్యంగా మారింది. అందుకే అధిష్టానం ఓ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.

అభ్యర్థులకు బాడీగార్డ్ లు.. కాంగ్రెస్ నిఘా మామూలుగా లేదు
X

ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా..? ఎగ్జాట్ పోల్స్ వేరే ఉంటాయా..? అనే ప్రశ్నలకు ఈరోజు సమాధానం తెలిసిపోతుంది. అయితే కాంగ్రెస్ ముందు జాగ్రత్తలు మాత్రం ఓ రేంజ్ లో ఉండటం విశేషం. గెలుపు, ఓటముల సంగతి పక్కనపెడితే.. గెలిచిన అభ్యర్థులను గట్టిగా పట్టుకోవడం కాంగ్రెస్ కి ప్రథమ కర్తవ్యంగా మారింది. అందుకే అధిష్టానం ఓ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఆదివారం ఉదయాన్నుంచే అది అమలులోకి వచ్చింది.

ఒక్కో అభ్యర్థికి ఒక్కో పరిశీలకుడు..

కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి ఏఐసీసీ తరపున ఒక పరిశీలకుడిని నియమించింది అధిష్టానం. ఆ అభ్యర్థి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆ నియోజకవర్గం పరిస్థితి ఏంటి..? అనే విషయాలన్నీ పరిశీలకుడే చూసుకోవాలి. గెలిచిన అభ్యర్థులంతా రిజల్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కి వచ్చేయాలి. హోటల్ తాజ్ కృష్ణలో వారి మకాం. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ టీమ్ మొత్తానికి ఇన్ చార్జ్. ఇదీ కాంగ్రెస్ వ్యూహం.

ప్లాన్-ఎ

శనివారం ఉదయం ప్లాన్-ఎ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థులందర్నీ శనివారం రాత్రికే హైదరాబాద్ తరలించడం, ఆదివారం ఓట్ల లెక్కింపు వ్యవహారం అంతా ప్రధాన పోలింగ్ ఏజెంట్లు చూసుకోవడం.. ఇలా స్కెచ్ వేశారు. చివరకు గెలిచిన తర్వాత ఇచ్చే ధృవీకరణ పత్రం కూడా అభ్యర్థుల తరపున ప్రధాన పోలింగ్ ఏజెంట్ తీసుకునేలా ఈసీతో కూడా మాట్లాడుకున్నారు. కానీ అభ్యర్థులు, లెక్కింపు కేంద్రాల వద్ద కచ్చితంగా అందుబాటులో ఉండాలన్న కీలక నేత సూచనతో ఆ ప్లాన్ మారిపోయింది.

ప్లాన్-బి

ప్లాన్-ఎ కుదరదని తేలడంతో ప్లాన్-బి అమలులోకి తెచ్చింది కాంగ్రెస్. దీని ప్రకారం అభ్యర్థులంతా కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఆయా కేంద్రాల్లోనే ఉండాలి. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటితే ఆలస్యం లేకుండా అందరూ హైదరాబాద్ వచ్చేయాలి. తాజ్ కృష్ణలో కాంగ్రెస్ క్యాంప్ నడపడం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం రాత్రే డీకే హైదరాబాద్ చేరుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తే ఆయన పూర్తి స్థాయిలో పని మొదలు పెడతారు. తేడా కొడితే మాత్రం కాంగ్రెస్ హడావిడి ఆగిపోతుంది.


First Published:  3 Dec 2023 12:53 AM GMT
Next Story