Telugu Global
Telangana

నియోజకవర్గాలకే పరిమితమైన కాంగ్రెస్‌ సీనియర్లు..!

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో నియోజకవర్గంపై ఫుల్‌ ఫోకస్ పెట్టారు.

నియోజకవర్గాలకే పరిమితమైన కాంగ్రెస్‌ సీనియర్లు..!
X

తెలంగాణలో పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ చీఫ్‌ కేసీఆర్.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌ రావులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్‌ షోలతో హోరెత్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

రాష్ట్రంలోని సీనియర్లంతా వారి సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మినహా మరెవరూ మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం లేదు. రేవంత్ ఒక్కడే రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలు తిరుగుతూ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు.. మిగతా నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. వీరంతా ఇప్పుడు సొంత నియోజకవర్గాలపైనే ఫుల్‌ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో నియోజకవర్గంపై ఫుల్‌ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా దాటి కోమటిరెడ్డి రావడం లేదు. ఇక ఉత్తమ్‌ది ఇదే పరిస్థితి. హుజూర్‌నగర్‌ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఉత్తమ్ సతీమణి కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ నుంచి, కోదాడ నుంచి పద్మావతి ఉత్తమ్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై ఉత్తమ్ ఫోకస్ పెట్టారు. ఇక సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సైతం కేవలం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది 3 వేల ఓట్ల తేడాతోనే. దీంతో వీరంతా ఇప్పుడు సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.

First Published:  16 Nov 2023 3:14 AM GMT
Next Story