Telugu Global
Telangana

తమిళనాడుకు ఒక రూల్, తెలంగాణకుమరో రూలా? మోడీని ప్రశ్నించిన కేటీఆర్

తమిళ నాడులోని మూడు గనులను వేలం జాబితా నుంచి మినహాయించిన కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తోందని కేటీఆర్ అన్నారు. ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకు ఉన్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.

తమిళనాడుకు ఒక రూల్, తెలంగాణకుమరో రూలా?  మోడీని ప్రశ్నించిన కేటీఆర్
X

సింగరేణి బొగ్గి గనులను వేలం వేయొద్దని, సింగరేణి సంస్థకే అప్పగించాలని తెలంగాణ‌ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతున్నా పట్టించుకోని మోడీ సర్కార్ తమిళనాడు విషయంలో మరో రకంగా ఎందుకు ప్రవర్తిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

తమిళనాడులోని మూడు గనులను వేలం జాబితా నుంచి మినహాయించిన కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తోందని అన్నారు. ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకు ఉన్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం పదే పదే డిమాండ్ చేస్తోంది. కేంద్రం మాత్రం ప్రైవేటు వారికి అప్పగించేందుకే మొండిగా వేలం వేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

సింగరేణిలోని పలు బ్లాకులను ప్రైవేటీకరించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల‌కు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా బీఆరెస్ నాయకత్వంలో ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.

అదే సమయంలో, తమిళనాడు ప్రతిపాదిత బొగ్గు బ్లాకుల వేలం నుండి కావేరి డెల్టా ప్రాంతంలోని మూడు బొగ్గు బ్లాకులను మినహాయించాలని ఏప్రిల్ 4న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చేసిన అభ్యర్థనకు కేంద్రం అంగీకరించింది.

"సింగరేణి కాలీరీస్ కోసం, తెలంగాణలోని 4 బొగ్గు గనులను వేలం జాబితా నుండి తొలగించి నేరుగా SCCLకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ, నిరసన వ్యక్తం చేస్తున్నాం. అయితే ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకు?" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


First Published:  9 April 2023 1:32 AM GMT
Next Story