Telugu Global
Telangana

విచారణ జరుగుతోంది, దోషులు తేలుతారు- రేవంత్ రెడ్డి

20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరుతారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై జగ్గారెడ్డి తమకు చెప్పలేదన్నారు.

విచారణ జరుగుతోంది, దోషులు తేలుతారు- రేవంత్ రెడ్డి
X

మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విచారణ తర్వాతే చర్యలుంటాయన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంత‌రం మీడియాతో రేవంత్ చిట్‌చాట్ చేశారు. "అమరవీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణాలపై విచారణ జరిపిస్తాం. విజిలెన్స్ విచారణ జరిపాం. జ్యుడీషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయి. ఇరిగేషన్‌పై ఆ శాఖ మంత్రి సభలో శ్వేతపత్రం విడుదల చేస్తారు. మేడిగడ్డకు వెళ్దామని సభ్యులందరినీ ఆహ్వానించాం.. 13న బీఆర్ఎస్ వాళ్ళకి మీటింగ్ ఉంటే ఒకరోజు ముందు వెనక వెళ్దామన్నా.. దేనికైనా మేం రెడీ" అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

"గత బడ్జెట్‌ కంటే 70 వేల కోట్టు తగ్గింది.. 23 శాతం బడ్జెట్‌ తగ్గింది. గతంలో అబద్ధాలతో బడ్జెట్లు నడిపించారు. మేము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు. నిజాలు చెప్పాలనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. పదేండ్లు అయినా కేసీఆర్‌కి బడ్జెట్ అంచనా వేయడం రాలేదు. వాస్తవాలకి అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేసినందుకు భట్టికి అభినందనలు" తెలిపారు రేవంత్ రెడ్డి.

బీఏసీకి హారీష్ రావును అనుమతించని అంశంపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. బీఏసీకి హాజరయ్యే పేర్లను బీఆర్ఎస్సే ఇచ్చిందని.. అందులో ఎవరి పేరు ఉంటే వారిని పిలుస్తారన్నారు. హరీష్ రావు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో బీఏసీలో ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయో అవి అమలు అవుతున్నాయన్నారు. తన భాషపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శల్ని రేవంత్ తిప్పి కొట్టారు. తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానన్నారు.

20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరుతారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై జగ్గారెడ్డి తమకు చెప్పలేదన్నారు. చెబితే అధిష్టానంతో మాట్లాడుతామన్నారు. ఎవరైనా సీఎంను కలవొచ్చని.. వారిపై వాళ్ల పార్టీలో అనుమానం ఉంటే తాను ఏమీ చేయలేనన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  10 Feb 2024 2:38 PM GMT
Next Story