Telugu Global
Telangana

విజన్-2050.. మరోసారి సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ మెగా మాస్టర్‌ప్లాన్‌-2050కి సంబంధించి త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిలో, మెగా మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనలో బిల్డర్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విజన్-2050.. మరోసారి సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

సీఎం పదవిలోకి వచ్చిన తర్వాత పదే పదే రేవంత్ రెడ్డి విజన్-2050పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 2050ని టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తామంటున్నారు. ఆలోగా సుందర తెలంగాణను తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన 31వ ఆల్‌ ఇండియా బిల్డర్స్‌ కన్వెన్షన్‌లో పాల్గొన్న ఆయన తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో ఓ విజన్‌ డాక్యుమెంట్‌ను తీసుకొస్తామన్నారు. ఇందులోభాగంగా తెలంగాణ మెగా మాస్టర్‌ప్లాన్‌-2050ని అమలు చేస్తున్నట్టు తెలిపారు రేవంత్ రెడ్డి.

భాగస్వాములు కండి..

తెలంగాణ మెగా మాస్టర్‌ప్లాన్‌-2050కి సంబంధించి త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిలో, మెగా మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనలో బిల్డర్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బిల్డర్స్‌ పాత్ర ఎంతో ఉందని చెప్పారు. కాంట్రాక్టర్లు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం బలపడుతుందని చెప్పిన రేవంత్ రెడ్డి.. బిల్డర్లకు సమస్యలు రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.

ఔటర్‌ రింగ్ రోడ్ లోపల అర్బన్‌ తెలంగాణ, ఔటర్‌ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సబర్బన్‌ తెలంగాణ, రీజనల్‌ రింగురోడ్డు వెలుపల నుంచి రాష్ట్ర సరిహద్దు వర కు రూరల్‌ తెలంగాణగా విభజిస్తూ మెగా మాస్టర్‌ప్లాన్‌-2050ని తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు మూసీనదిని పునరుజ్జీవింపచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే మూసీ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధికి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తామన్నా­రు. 55 కిలోమీటర్ల పొడవైన మూసీనది వెంట కనెక్టింగ్‌ కారిడార్లు, మెట్రో, క్రీడలు, వినోద కేంద్రాలు, హోటళ్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

First Published:  28 Jan 2024 2:27 AM GMT
Next Story