Telugu Global
Telangana

ఆ దిష్టిబొమ్మ గెల‌వాలా..? మన పద్మ నిలవాలా..?

రామాయంపేట ప్ర‌జ‌లు.. ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ప‌వ‌ర్ ఏంటో చూశారు కాదా..? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఆర్డీవో ఆఫీస్, డిగ్రీ కాలేజీ.. ఇలా అన్నీ మెదక్ నియోజకవర్గానికి వచ్చాయన్నారు.

ఆ దిష్టిబొమ్మ గెల‌వాలా..? మన పద్మ నిలవాలా..?
X

"పొద్దున్నుంచి రాత్రి వ‌ర‌కు మీ మ‌ధ్య‌లో ఉండే ప‌ద్మ గెలిస్తే మీ కోసం ప‌ని చేస్తుంది. అదే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డికి, ఆ కాంగ్రెస్‌ తరపున నిల‌బడ్డ వానికి ఏమ‌న్నా పోలిక ఉందా..? ఏదో దిష్టిబొమ్మ‌ను తీసుకొచ్చి ప‌ద్మ ఎదురుగా పెడితే.. ఆయ‌న గెల‌వాలి.. మ‌నం ఓడిపోవాల్నా..? ప‌ద్మే గెల‌వాలి. వంద శాతం గెలిపించండి.. మీ త‌ర‌పున ఆమె కోరిన కోరిక‌ల‌ను తీర్చే బాద్య‌త నాది." అని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. మెదక్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.

మెదక్ లో మైనంపల్లి హన్మంతరావు కొడుకు రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ సీటుకోసమే మైనంపల్లి తన సీటు కూడా వద్దనుకుని బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి కొడుకుని దిష్టిబొమ్మ అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు కేసీఆర్.

పద్మ పవర్ చూశారు కదా..?

రామాయంపేట ప్ర‌జ‌లు.. ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ప‌వ‌ర్ ఏంటో చూశారు కాదా..? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఆర్డీవో ఆఫీస్, డిగ్రీ కాలేజీ.. ఇలా అన్నీ మెదక్ నియోజకవర్గానికి వచ్చాయన్నారు. ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి తన బిడ్డ అని ఊరికే చెప్పలేదని, ఆమె అనుకుంటే ప‌నులు అలా పూర్తవుతాయని చెప్పారు. రింగ్ రోడ్, ఇంజినీరింగ్ కాలేజీ కూడా నడుచుకుంటూ వస్తాయన్నారు. మెదక్ లో ఇప్పటికే చాలా ప్రాంతాలకు మంచినీళ్లు వచ్చాయని, మిగతా ప్రాంతాలకు కూడా నీరు అందించే బాధ్యత తనది అని చెప్పారు కేసీఆర్. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టి 58 ఏళ్లు మ‌న గోస‌ పోసుకుని, ఉద్య‌మాలు చేస్తే, మ‌న పిల్ల‌ల్ని కాల్చి చంపి, రాచిచంపాన పెట్టిన కాంగ్రెస్ కొత్త రూపంతో మ‌ళ్లీ వ‌స్తుంది. మోస‌పోతే మ‌ళ్లీ గోస‌ప‌డతాం అని హెచ్చరించారు సీఎం కేసీఆర్.

First Published:  15 Nov 2023 2:59 PM GMT
Next Story