Telugu Global
Telangana

రెండు నెలల్లో ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తా..!

రైతుబంధుని మరోసారి కాంగ్రెస్ ఆపివేసిందని.. ఎన్నిరోజులు దాన్ని ఆపుతారో చూస్తానని చెప్పారు కేసీఆర్. మళ్లీ మన ప్రభుత్వమే వచ్చి ఆరో తేదీ నుంచి రైతుబంధు పంపిణీ ప్రారంభమవుతుందని భరోసా ఇచ్చారు.

రెండు నెలల్లో ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తా..!
X

చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు రెండు మూడు సమస్యలు ప్రధానంగా ఉన్నాయని అందులో 111 జీవో రద్దు ఒకటని చెప్పారు సీఎం కేసీఆర్. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే ఆ జీవో రద్దు చేశామని.. దాన్ని పూర్తి స్థాయిలో క్లియర్ చేసే బాధ్యత తనదేనని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు నెలల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చీమకు, దోమకు కూడా హాని చేయని యాదయ్యను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.


కాంగ్రెస్ నాయకులకు పిచ్చిలేచింది..

తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని నాడు దుష్ప్రచారం చేశారని, కానీ నేడు ధరలు పెరిగి యజమానులు ఎంత సంతోషంగా ఉన్నారో అందరికీ తెలుసని వివరించారు సీఎం కేసీఆర్. ఎన్నికలు రాగానే తప్పుడు ప్రచారాలు చేస్తారని, రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారని మండిపడ్డారు. రైతుబంధు విషయంలో కాంగ్రెస్ నేతలు తమ పిచ్చిని మరోసారి బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధుని మరోసారి కాంగ్రెస్ ఆపివేసిందని.. ఎన్నిరోజులు దాన్ని ఆపుతారో చూస్తానని చెప్పారు కేసీఆర్. మళ్లీ మన ప్రభుత్వమే వచ్చి ఆరో తేదీ నుంచి రైతుబంధు పంపిణీ ప్రారంభమవుతుందని భరోసా ఇచ్చారు. చేవెళ్ల నుంచి తాను తెలంగాణ రైతులందరికీ ఈ విషయాన్ని మనవి చేస్తున్నానని చెప్పారు కేసీఆర్.

హైదరాబాద్ పక్కనే ఉన్న చేవెళ్లకు ఎవరూ కర్మాగారాలు తెచ్చే ప్రయత్నం చేయలేదని అన్నారు సీఎం కేసీఆర్. షాబాద్, చందన్ వెల్లి, సీతారాంపూర్ లో వివిధ కంపెనీలు వచ్చాయని చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని కేంద్రం ఎగ్గొట్టినా.. కేటీఆర్, యాద‌య్య క‌లిసి రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ తీసుకొచ్చారని.. శంక‌ర్‌ ప‌ల్లి మండ‌లం కొండ‌క‌ల్ గ్రామంలో ఆ ఫ్యాక్టరీని తానే ప్రారంభించానని చెప్పారు కేసీఆర్.


చేవెళ్ల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తున్నట్టు తెలిపారు సీఎం కేసీఆర్. ఇక నియోజకవర్గానికి పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు పదేళ్లు అడ్డుకున్నారని, కానీ ఇప్పుడది క్లియర్ అయిందని చెప్పారు. రంగారెడ్డి – పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా వచ్చే నీరు మొదట చేవెళ్లకే వస్తుందన్నారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల‌కు కూడా ఈ నీళ్లు వ‌స్తాయన్నారు కేసీఆర్.



First Published:  27 Nov 2023 10:57 AM GMT
Next Story