Telugu Global
Telangana

ఓటింగ్ కి కేసీఆర్.. ఆ పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు

పోలీస్ కమిషనర్ శ్వేత ముందస్తుగా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ రోజు గ్రామానికి చేరుకొని హెలిప్యాడ్‌, పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తుపై తగిన ఆదేశాలు ఇచ్చారు.

ఓటింగ్ కి కేసీఆర్.. ఆ పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు
X

సీఎం కేసీఆర్ ప్రతిసారి తన స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఓటు వేసేందుకు సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామానికి వస్తారు. ఆ గ్రామంలోని 13వ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు ఉంది. ఆ పోలింగ్ బూత్ లోనే కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకుంటారు. కేసీఆర్ రాక సందర్భంగా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

సెక్యూరిటీ చెక్..

సీఎం కేసీఆర్ చింతమడకకు వస్తారన్న సమాచారంతో సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ముందస్తుగా ఏర్పాట్లు పరిశీలించారు. ఈరోజు గ్రామానికి చేరుకొని క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లను తానే దగ్గరుండి పర్యవేక్షించారు. హెలిప్యాడ్‌, పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తుపై తగిన ఆదేశాలు ఇచ్చారు. సిద్ధిపేట పరిధిలో మొత్తం 2632మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్ధిపేట కమిషనరేట్‌ కు చెందిన అధికారులు, సిబ్బంది, స్థానిక సాయుధ బలగాలు, జిల్లా హోంగార్డులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌ లు, రైల్వే పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సీఆర్‌పీఎఫ్‌, జార్ఖండ్‌ స్టేట్ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, అధికారులు, సిబ్బంది బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు.

సిద్ధిపేటలో సమస్యాత్మక కేంద్రాలు..

సిద్ధిపేట జిల్లాలో రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి 278 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాన్ని జియో ట్యాగింగ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా 10 డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు.


First Published:  29 Nov 2023 11:48 AM GMT
Next Story