Telugu Global
Telangana

వరదలపై కేసీఆర్ సమీక్ష.. మంత్రులకు కీలక ఆదేశాలు

భద్రాచలంలో వరద పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడారు సీఎం కేసీఆర్. సీఎం ఆదేశాల మేరకు భద్రాచలం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన మంత్రి పువ్వాడ, స్థానిక పరిస్థితిని ఆయనకు వివరించారు.

వరదలపై కేసీఆర్ సమీక్ష.. మంత్రులకు కీలక ఆదేశాలు
X

తెలంగాణలో వరద పరిస్థితిపై మూడో రోజు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి స్థానిక పరిస్థితులను తెలుసుకుంటున్న ఆయన.. రాత్రి పొద్దుపోయే వరకు పర్యవేక్షణ జరిపారు. ఎప్పటికప్పుడు మంత్రులతో ఫోన్లో మాట్లాడుతూ కీలక ఆదేశాలిచ్చారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ముంపు కాలనీలు, మూసీ పరివాహక ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. పారిశుధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు.


సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేసి వరద పరిస్థితులపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులు, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య పరీక్షలు, మందుల సరఫరా పరిస్థితిని సీఎంకు ఫోన్లో వివరించారాయన. సీఎం ఆదేశాలతో ఇప్పటికే వైద్యశాఖలో ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిగమ్నమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్నారు మంత్రి హరీష్ రావు.

భద్రాచలంలో వరద పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడారు సీఎం కేసీఆర్. సీఎం ఆదేశాల మేరకు భద్రాచలం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన మంత్రి పువ్వాడ, స్థానిక పరిస్థితిని ఆయనకు వివరించారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 12వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో నష్టాన్ని అంచనావేస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను ఫోన్లో ఆదేశించారు సీఎం కేసీఆర్. సీఎం ఆదేశాలతో మంత్రి మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు, ఆర్ అండ్ బీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే గుండ్ల వాగు రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

ముంపు ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు సీఎం కేసీఆర్. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. రవాణా సౌకర్యం లేని ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు. మందులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరికి వరద పెరగడంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ ఫ్లో ను ముందస్తు అంచనా వేసి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ నీటిని కిందకు వదలాలని చీఫ్ ఇంజనీర్లకు కేసీఆర్ ఆదేశాలిచ్చారు.

First Published:  30 July 2023 2:30 AM GMT
Next Story