Telugu Global
Telangana

రేవంత్ రెడ్డిపై మరోసారి ధ్వజమెత్తిన సీఎం కేసీఆర్

ప్ర‌జల ఆకాంక్ష‌లు నెర‌వేర్చే పార్టీలే గెల‌వాలని చెప్పారు సీఎం కేసీఆర్. అప్పుడే ప్ర‌జ‌ల కోరిక‌లు తీరుతాయన్నారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.

రేవంత్ రెడ్డిపై మరోసారి ధ్వజమెత్తిన సీఎం కేసీఆర్
X

రేవంత్ రెడ్డిపై మరోసారి ధ్వజమెత్తిన సీఎం కేసీఆర్

నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. రైతుబంధుని బిచ్చమంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాంటి వాళ్లు రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. 24 గంటలు రైతులకు కరెంటు అవసరం లేదని, 3 గంటలు చాలని ఆయన అంటున్నాడని, రైతులకు కరెంటు ఉండాలా వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తామంటున్నారని, అలాంటి పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందా అన్నారు. నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు సీఎం కేసీఆర్.


ఇంద్రకరణ్ రెడ్డి కొట్లాడబట్టే నిర్మ‌ల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలుగా చేశామన్నారు సీఎం కేసీఆర్. ఈ ప్రాంతానికి నాలుగు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయని, ఇంజినీరింగ్ కాలేజీ కావాల‌ని కూడా ఎమ్మెల్యే అడిగారని.. అదికూడా ఇస్తామని చెప్పారు. తన ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబ‌ట్టే ఇంద్రకరణ్ రెడ్డి ఒక్కొకటీ అడుగుతున్నారని చెప్పారు. ఇంద్రకరణ్ రెడ్డి ఒక్కరే 15 సబ్ స్టేషన్లు నిర్మల్ నియోజకవర్గంలో పెట్టించారని చెప్పారు. అలాంటి మంచి వ్యక్తిని మంచి మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సభతో ఇంద్రకరణ్ రెడ్డి విజయం ఖాయమైపోయిందని చెప్పారు కేసీఆర్.

ఆలోచించి ఓటు వేయండి..

ప్ర‌జల ఆకాంక్ష‌లు నెర‌వేర్చే పార్టీలే గెల‌వాలని చెప్పారు సీఎం కేసీఆర్. అప్పుడే ప్ర‌జ‌ల కోరిక‌లు తీరుతాయన్నారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. తన మాట‌ల్ని గ్రామాల్లో, బ‌స్తీల్లో చ‌ర్చకు పెట్టాలని సూచించారు. తెలంగాణ రాకముందు అన్నిటికీ ఇబ్బందిపడాల్సి వచ్చేదని, తెలంగాణ వచ్చాక అన్నీ చక్కబడ్డాయని చెప్పారు. వ్యవసాయ స్థిరీకరణతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమయిందన్నారు. రైతుబంధు ఎవరూ అడిగింది కాదన్నారు, దళితబంధు కోసం ఎవరూ డిమాండ్లు చేయలేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఈ పథకాలన్నీ తీసుకొచ్చామని వివరించారు సీఎం కేసీఆర్.

First Published:  2 Nov 2023 9:55 AM GMT
Next Story