Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ గొప్ప విజనరీ లీడర్.. రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి జరుగుతోంది : మంత్రి కేటీఆర్

రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో రాబోతోంది. ఇప్పటికే టెంటర్లు ఖరారు అయ్యియి. త్వరలోనే వాటి పనులు కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

సీఎం కేసీఆర్ గొప్ప విజనరీ లీడర్.. రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి జరుగుతోంది : మంత్రి కేటీఆర్
X

హైదరాబాద్‌కు ధీటుగా పట్టణాలు, పల్లెలు కూడా అభివృద్ధి చేస్తున్నాము. రాష్ట్రంలో సమిష్టిగా, సమతుల్యంగా పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ విజనరీతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని.. ఆయన గొప్ప దార్శనికత ఉన్న నాయకుడు అని కేటీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో -2023ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

తెలంగాణ రాక ముందు 7000 మెగా వాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ఇచ్చే వారు. జిరాక్స్ సెంటర్లు, జ్యూస్ స్టాల్స్ నడవాలన్నీ కరెంటు లేక ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకునే వారు. కానీ ఇవ్వాళ రాష్ట్రంలో 26 వేల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులో ఉన్నదని అన్నారు. హైదరాబాద్‌లో తాగు నీటి కష్టాలను కూడా తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో 10 శాతం నీటిని తాగు నీటికి కేటాయించినట్లు పేర్కొన్నారు. 2052 వరకు హైదరాబాద్‌లో ఎంత జనాభా పెరిగినా తాగు నీటికి ఇబ్బంది లేకుండా చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

మెట్రో టెండర్లు ఖరారయ్యాయి..

హైదరాబాద్ జనాభా పెరుగుతోంది. నగర శివార్లలో కూడా కాలనీలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు సరిపోవు. అందుకే తెలంగాణ ప్రభుత్వం నగరంపై ప్రత్యేక శ్రద్ద పెట్టిందని చెప్పారు. ఇప్పటికే మొదటి దశ మెట్రోను పూర్తి చేసుకున్నాము. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో రాబోతోంది. ఇప్పటికే టెంటర్లు ఖరారు అయ్యియి. త్వరలోనే వాటి పనులు కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇక తర్వాతి దశలో 470 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నాము. ఔటర్ రింగ్ రోడ్‌కు సమాంతరంగా, నగరం చుట్టూ మెట్రోను నిర్మిస్తాము. నగరంలో కూడా ఇతర ప్రాంతాలను మెట్రోను విస్తరించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

డబ్బా బిల్డింగులు కట్టొద్దు..

హైదరాబాద్ నగరం ఇప్పుడు దేశంలోనే అత్యధిక స్కై స్క్రాపర్స్ ఉన్న రెండో నగరంగా నిలిచింది. రాబోయే రోజుల్లో నగరంలో మరిన్ని ఎత్తైన బిల్డింగ్స్ రాబోతున్నాయి. హెచ్ఎండీఏ వద్ద ఇప్పటికే చాలా మంది అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే గ్లోబల్ సిటీగా ఎదగాలంటే డబ్బా బిల్డింగులు కడితే సరిపోదని అన్నారు. అందమైన బిల్డింగ్స్ కూడా కట్టాలి. గ్రీన్ బిల్డింగ్స్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి చెప్పారు.

హైదరాబాద్ అంటే అందరూ గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్ అని విమర్శిస్తుంటారు. అది సరి కాదు.. న్యూయార్క్ వంటి నగరం పేరు చెప్పినా మాన్‌హాటన్ పేరే గుర్తొస్తుంది. కానీ అక్కడ కూడా పాత పట్టణాలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కేవలం వెస్ట్ వైపే దృష్టి పెట్టొదని అన్నారు. అలా చేస్తే.. బెంగళూరు నగరం మాదిరిగా తయారవుతుందని హెచ్చరించారు. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్ వంటి ప్రాంతాలపై దృష్టి పెట్టాలని. అక్కడ కూడా అన్ని హంగులు ఉన్నాయని చెప్పారు.

వచ్చే ఏడాది కూడా ఈ ఎక్స్‌పోను నిర్వహించి నన్ను పిలవాలని కోరారు. ఎందుకంటే ఎన్నికల్లో మేమే గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తా.. అప్పుడు నేన్నే పిలవాలని మంత్రి కేటీఆర్ చలోక్తి విసిరారు.

First Published:  9 Sep 2023 8:26 AM GMT
Next Story