Telugu Global
Telangana

బాక్సర్ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు

ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నిఖత్‌కు ఇది రెండో గోల్డ్ మెడల్ కావడం గొప్ప విషయమని కేసీఆర్ ప్రశంసించారు.

బాక్సర్ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు
X

ఇండియన్ స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమెను అభినందించారు. వియత్నంకు చెందిన బాక్సర్ న్యూయెన్‌పై 5-0 తేడాతో విజయం సాధించి.. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలవడం సంతోషకరమని కేసీఆర్ అన్నారు. నిఖత్ జరీన్ సాధించిన గోల్డ్ మెడల్ తెలంగాణకు గర్వకారణమని.. అమె తెలంగాణ బిడ్డ కావడం సంతోషకరమని అన్నారు. వరుస విజయాలతో దేశ ఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని సీఎం పేర్కొన్నారు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నిఖత్‌కు ఇది రెండో గోల్డ్ మెడల్ కావడం గొప్ప విషయమని కేసీఆర్ ప్రశంసించారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ.. వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆదివారం న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ బాకింగ్స్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు సాధించారు. 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్, 75 కేజీల విభాగంలో బోర్గహైన్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. నిఖత్ జరీన్ 5-0 తేడాతో వియత్నాంకు చెందిన న్యూయెన్‌పై.. బోర్గోహైన్ 5-2 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌పై విజయం సాధించారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్, లోవ్లీనా బోర్గోహైన్‌ పతకాలు సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కూడా అభినందించారు. నిఖత్ ఒక అద్భుతమైన బాక్సర్ అని మోడీ అన్నారు. అనేక సందర్భాల్లో ఆమె దేశం తలెత్తుకునేలా విజయాలు సాధించారని మోడీ అన్నారు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణమని చెప్పారు.



First Published:  27 March 2023 4:30 AM GMT
Next Story