Telugu Global
Telangana

గద్దర్ అవార్డులు : రేవంత్ సర్కార్ కు చిరంజీవి బాసట

నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం సముచితమైందని ఆయన అన్నారు.

గద్దర్ అవార్డులు : రేవంత్ సర్కార్ కు చిరంజీవి బాసట
X

సినిమా వాళ్ళకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని కొద్ది రోజుల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినీ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి గద్దర్ అని.. అటువంటి వ్యక్తి పేరిట సినీ అవార్డులు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు వచ్చాయి. సినీ పెద్దలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అంగీకరించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి కూడా ఈ సత్కారాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం సముచితమైందని ఆయన అన్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా పెద్దగా అందరూ చెప్పుకునే చిరంజీవి గద్దర్ అవార్డులకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇక ఈ పేరిటే ప్రభుత్వం అవార్డులు ఇచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  4 Feb 2024 11:38 AM GMT
Next Story