Telugu Global
Telangana

చార్మినార్ ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లు.. 2024 కల్లా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ

చార్మినార్ ప్రాజెక్టును పూర్తి చేసి.. హైదరాబాద్ నగరానికి వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్‌ను తప్పకుండా తీసుకొని వస్తామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పారు.

చార్మినార్ ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లు.. 2024 కల్లా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ
X

రెండు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్న చార్మినార్ పెడస్ట్రినైజేషన్ ప్రాజెక్ట్ (సీపీపీ) పనులపై మున్సిపల్ మంత్రి కేటీఆర్.. పాత నగరం ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అక్కడి ప్రజల ఆంకాంక్షలను సకాలంలో నెరవేర్చలేకపోయినట్లు మంత్రి తెలిపారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని, 2024 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సీపీపీ ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

చార్మినార్ ప్రాజెక్టును పూర్తి చేసి.. హైదరాబాద్ నగరానికి వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్‌ను తప్పకుండా తీసుకొని వస్తామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పారు. హెచ్ఎండీఏ ద్వారా కులీ కుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు ఇస్తామని కేటీఆర్ వివరించారు. 2001లో ప్రాజెక్టు ప్రారంభమైంది. కానీ, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో తాత్సరం జరిగింది. త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసి.. చాలా వైభవంగా ప్రారంభిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే 8 పనులు పూర్తయ్యాయని.. మరో 93 పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు చార్మినార్ ప్రాజెక్టు కోసం రూ.353 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

సీపీపీ మొదలైన సమయంలో నేను, అక్బరుద్దీన్ ఓవైసీ చాలా యంగ్‌గా ఉన్నాము. ఇప్పుడు మా పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు.. అయినా చార్మినార్ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదని అన్నారు. ఈ విషయంలో ఓల్డ్ సిటీ ప్రజలను నిరాశకు గురి చేశామని కేటీఆర్ చెప్పారు. అలాగే, మూసీ నదిపై రూ.40 కోట్ల వ్యయంతో రెండు పాదచారుల వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపారు.

సాలార్‌జంగ్ మ్యూజియం, అఫ్జల్‌గంజ్ సెంట్రల్ లైబ్రరీ మధ్య ఐకానిక్ బ్రిడ్జితో పాటు.. నయాపూల్ దగ్గర కూడా ఒక బ్రిడ్జి నిర్మిస్తామని కేటీఆర్ చెపపారు. అలాగే మొజంజాహీ మార్కెట్ వద్ద పురాతన కట్టడాలను మరింత శోభాయమానంగా తీర్చి దిద్దుతామని అన్నారు.

First Published:  5 Aug 2023 2:51 AM GMT
Next Story