Telugu Global
Telangana

నేనే....నేనే...నేనే... మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసిన చంద్రబాబు

కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి కారణం తానే నని, తాను అధికారంలో ఉండగా ఫార్మా కంపెనీలను ప్రోత్సహించి, వారి అభివృద్దికి కారణమయ్యాను కాబట్టే వారీ రోజు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టగలిగారని చంద్రబాబు చెప్పారు. ''మీరందరూ వాడుతున్న‌ సెల్ ఫోన్ ఎప్పుడొచ్చింది ? ప్రధానులను మెప్పించి, ఒప్పించి టెలీ కమ్యూనికేషన్ రంగంలో సమూల మార్పులు తేగలిగాను కాబట్టే సెల్ ఫోన్ ఈ రోజు మీరంతా వాడగల్గుతున్నారు. కానీ నన్ను మర్చిపోయారు'' అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నేనే....నేనే...నేనే... మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసిన చంద్రబాబు
X

*30 ఏళ్ళ తర్వాత ఏంజరగనుందో ఇప్పుడే చెప్పగలను

*హైదరాబాద్ అభివృద్ది నేనే చేశాను.

*కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి నేనే కారణం

*సెల్ ఫోన్ రావడానికి నేనే కారణం

*శంషా బాద్ ఎయిర్ పోర్ట్ నేనే తెచ్చాను

*ఇప్పుడున్న అద్భుతమైన‌ నేషనల్ హైవేల నిర్మాణానికి కారణం నేనే

* తెలంగాణ ఈ రోజు తలసరి ఆదాయంలో దేశంలోనే ముందుభాగాన ఉండడానికి కారణం నేనే

*హైదరాబాద్ లేకపోతే, నేనా రోజు ఫౌండేషన్ వేయక పోతే ఇంత అభివృద్ది జరిగేదా ?

*సైబరాబాద్ కట్టింది నేనే

* ఖమ్మం సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

30 ఏళ్ళ తర్వాత ఏంజరగనుందో ఇప్పుడే చెప్తానని, అందుకు మిమ్మల్నందరినీ ప్రిపేర్ చేస్తానని, ఈ నాటి జనరేషన్ ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు అన్నారు. ఖమ్మం పట్టణంలో జరిగిన తెలుగు దేశం పార్టీ పునర్నిర్మాణ సభలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ అభివృద్ది చేసింది నేనే, హైద్రాబాద్ కి ఐటీ తెచ్చింది నేనే అని నమ్మే వాళ్ళు చేతులు పైకెత్తండి తమ్ముళ్ళూ అని సభలో పాల్గొన్న ప్రజల చేతులు పైకెత్తించారు.

''మైక్రో సాఫ్ట్ లాంటి అనేక కంపెనీలను హైదరాబాద్ కు తెచ్చింది నేనే . ఇప్పుడు ఇంకా అనేక కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయంటే కారణం నేను ఫౌండేషన్ వేశాను కాబట్టే. ఒకప్పుడు హైదరాబాద్, సికిందరాబాద్ మాత్రమే ఉండేవి. నేను సైబరాబాద్ కట్టాను. హైద్రాబాద్ ను ఎన్నో రెట్లు అభివృద్ది చేశాను'' అని చెప్పారు చంద్రబాబు.

కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి కారణం తానే నని, తాను అధికారంలో ఉండగా ఫార్మా కంపెనీలను ప్రోత్సహించి, వారి అభివృద్దికి కారణమయ్యాను కాబట్టే వారీ రోజు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టగలిగారని చంద్రబాబు చెప్పారు. ''మీరందరూ వాడుతున్న‌ సెల్ ఫోన్ ఎప్పుడొచ్చింది ? ప్రధానులను మెప్పించి, ఒప్పించి టెలీ కమ్యూనికేషన్ రంగంలో సమూల మార్పులు తేగలిగాను కాబట్టే సెల్ ఫోన్ ఈ రోజు మీరంతా వాడగల్గుతున్నారు. కానీ నన్ను మర్చిపోయారు'' అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

''హైదరాబాద్ లో శంషా బాద్ ఎయిర్ పోర్ట్ నేనే తెచ్చాను. సూర్య పేట, ఖమ్మం నేషనల్ హైవే ఇంత అందంగా ఉందంటే కారణమెవరు ? నేనా రోజు ప్రధానితో చెప్పి ఒప్పించడం వల్లే నేషనల్ హైవేలు వచ్చాయి. '' అని చంద్రబాబు అన్నారు.

''దళితులకు, బీసీలకు పెద్ద పెద్ద పదవులిచ్చింది నేనే. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు 1985 లో టీడీపీ ఇచ్చింది. మహిళల ఆర్థిక స్వాలంభన కోసం డ్వాక్రా సంఘాలు నేనే పెట్టాను. మహిళలను ఆర్థికంగా బలంగా తయారు చేశాను. మహిళలకు, విద్యా ఉద్యోగాల్లో33 శాతం రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం. మగ పిల్లల కన్నా ఆడ‌పిల్లలు ఈ రోజు ఎక్కువగా సంపాదిస్తున్నారంటే కారణం నేనే. ఇప్పుడు చెప్పండి తెలంగాణలో టీడీపీ అవసరం ఉందా లేదా ?'' అని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. తానేసిన పౌండేషన్ తెలంగాణలో సీఎం లు కొనసాగించారని అందుకే తెలంగాణ అభివృద్ది చెందుతోందని, కానీ ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ఈ రోజు తలసరి ఆదాయంలో దేశంలో ముందుభాగాన ఉందంటే తానేసిన ఫౌండేషన్ కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. .

తెలంగాణలో దేవాదుల, ఎస్సార్ ఎస్పీ, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులన్నీ టీడీపీ తెచ్చింది. ఎస్సెల్ బీసీ తెచ్చి నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు తప్పించిన‌ ఘనత టీడీపీదీ. ఖమం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు అన్నీ టిడీపి హాయంలోనే పూర్తి చేశాం అన్నారు బాబు.

''తెలంగాణలో ఓట్లడిగే హక్కు మిగతా పార్టీలకన్నా టీడీపికే ఎక్కువగా ఉంది. తెలుగు దేశం అభిమానులు మళ్ళీ ఆక్టీవ్ కండి. కొందరు వేరే పార్టీల్లోకి వెళ్ళారు. అందరూ మళ్ళీ వెనక్కి రండి. నాయకులెవ్వరూ లేకున్నా మీరందరూ ఈ సభకొచ్చారు. మీరుంటే చాలు నాయకులు తయారవుతారు.'' అమి చెప్పారు చంద్రబాబు.

''హైదరాబాద్ లేకపోతే, నేనా రోజు ఫౌండేషన్ వేయక పోతే ఇంత అభివృద్ది జరిగేదా ? ఆ అభివృద్ది ఫలాలు అనుభవించే వాళ్ళు ఆలోచించండి. తెలుగు దేశాన్ని పునర్నిర్మాణం చేద్దాం, పూర్వ వైభవం తెద్దాం రండి,'' అని పిలుపునిచ్చారు చంద్రబాబు.

ఆంధ్రాలోకన్నా తెలంగాణలోనే తన‌ మీద ఎక్కువ అభిమానం కనపడుతోందని. ఈ రాత్రి ఆనందంగా నిద్ర పోతానన్నారు బాబు.సభకు వచ్చిన జనాలను చూపిస్తూ తెలుగు దేశం ఎక్కడ అని అడిగేవాళ్ళకు ఇదే సమాధానం అన్నారు బాబు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా అధ్యక్షుడైన కాసాని ఙానేశ్వర్ అధ్యక్షతన ఈ సభ‌ జరిగింది. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాక ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలను‍ండి కూడా ప్రజలను తరలించారు. సభకు ముందు ఖమ్మం పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది

First Published:  21 Dec 2022 4:39 PM GMT
Next Story