Telugu Global
Telangana

కాళేశ్వరంపై కుట్ర.. చలో మేడిగడ్డలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజల గొంతులు ఎండకుండా ఉండటానికి తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు కేటీఆర్.

కాళేశ్వరంపై కుట్ర.. చలో మేడిగడ్డలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ బృందం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ సహా కీలక నేతలు బస్సులో మేడిగడ్డకు బయలుదేరారు. బస్సు యాత్రకు ముందు నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు కేటీఆర్‌. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని సూచించారు.


ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజల గొంతులు ఎండకుండా ఉండటానికి తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు కేటీఆర్. తమ మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దన్నారు. ఎండుతున్న పంటలకు తక్షణమే నీరందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మరమ్మతులు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. మరమ్మతు పనులు తక్షణం మొదలు పెట్టకపోతే వర్షాకాలంలో బ్యారేజ్‌ కొట్టుకుపోతుందనేది కాంగ్రెస్ నాయకుల ఉద్దేశమని, అందుకోసమే వారు రిపేర్ వర్క్ ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ముందుచూపుకి నిదర్శనం అని, దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం మొదలు పెట్టిందని మండిపడ్డారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి. రైతులపై కాంగ్రెస్ కి ప్రేమ ఉంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. మేడిగడ్డ ఆనకట్టలోని 84 పిల్లర్లలో 3 మాత్రమే కుంగాయని, లోపాలు సవరించాలి కానీ.. రాజకీయం చేయొద్దని సూచించారు. బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించడానికి వెళ్తుంది. అక్కడ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తారు. మీడియాతో నేతలు మాట్లాడతారు, ప్రజలకు వాస్తవాలు వివరిస్తారు.

First Published:  1 March 2024 6:43 AM GMT
Next Story