Telugu Global
Telangana

తెలంగాణలో బాయిల్డ్ రైస్ కొనేందుకు కేంద్రం అంగీకారం

తెలంగాణ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను సేకరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

తెలంగాణలో బాయిల్డ్ రైస్ కొనేందుకు కేంద్రం అంగీకారం
X

కొంత కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్న బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) వివాదానికే తెరపడినట్టేనా ? తెలంగాణ లోని బాయిల్డ్ రైస్ ను కొనాలని ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం ససేమిరా అంటోంది. అయితే ఇంత కాలానికి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనడానికి ఒప్పుకుంది.

2021-22 రబీ సీజన్ కు గాను తెలంగాణ నుంచి ఫుడ్ కార్పోరేషన్ ఇండియా(FCI) ద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

ఉప్పుడు బియ్యాన్ని కొనాలని నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్ కు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.FCI వద్ద మూడేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం నిల్వలు ఉన్నప్పటికి తెలంగాణ రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈనిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే తెలంగాణ 6.05 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని కేంద్రప్రభుత్వం సేకరిస్తుండగా.. దీనికి అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ముందుకొచ్చిందని ఆయన‌ వెల్లడించారు.

First Published:  11 Aug 2022 9:43 AM GMT
Next Story