Telugu Global
Telangana

రంజిత్‌ రెడ్డి ద్రోహి, స్వార్థపరుడు - కేటీఆర్

ముందే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. ఈ ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి.. అధికారం, ఆస్తుల కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్‌కు ద్రోహం చేశారన్నారు.

రంజిత్‌ రెడ్డి ద్రోహి, స్వార్థపరుడు - కేటీఆర్
X

కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌ రెడ్డిపై ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రంజిత్‌ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి గెలిపించే వరకు రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ప్రపంచానికి తెలియదన్నారు కేటీఆర్. రంజిత్‌ రెడ్డికి రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, నియోజకవర్గంలోనూ స్వేచ్ఛ ఇచ్చామన్నారు.


ముందే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. ఈ ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి.. అధికారం, ఆస్తుల కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్‌కు ద్రోహం చేశారన్నారు. రంజిత్‌ రెడ్డి తన సోదరి అని చెప్పుకునే కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి.. అరెస్టు చేసిన రోజే.. నవ్వుకుంటూ కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడంటూ తీవ్రంగా స్పందించారు కేటీఆర్. రంజిత్‌ రెడ్డికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని కేవలం కార్యకర్తలే కాదు.. ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారన్నారు.

గతంలో ఎన్నికలకు ముందు అప్పటి ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకుని ఇతర పార్టీలోకి వెళ్తే ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు కేటీఆర్‌. పార్టీ కన్నా తానే పెద్ద అనుకునే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవలేరన్నారు కేటీఆర్. అలా జరిగితే దేశంలో పార్టీలు ఉండవు.. స్వతంత్రులే గెలుస్తారన్నారు. చేవెళ్లలో ఏప్రిల్ 13వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందన్నారు కేటీఆర్. సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు ఖాయమన్నారు.

First Published:  27 March 2024 10:00 AM GMT
Next Story