Telugu Global
Telangana

డి.కె.శివకుమార్‌కు కేటీఆర్ కౌంటర్‌

దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

డి.కె.శివకుమార్‌కు కేటీఆర్ కౌంటర్‌
X

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలవుతున్నాయో లేదో చూడాలంటే కర్ణాటక రావాలంటూ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ డి.కె.శివకుమార్ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. అయితే శివ‌కుమార్‌ సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసిన తెలంగాణ ప్రజలకు అర్థమైపోయిందన్నారు కేటీఆర్.

దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అది కాంగ్రెస్‌ పార్టీ చేతగానితనానికి నిదర్శనమన్నారు కేటీఆర్. మీ వైఫల్యాలను చూడ్డానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో మోసపోయిన రైతులే ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌తో పొంచి ఉన్న ముప్పుపై కర్ణాటక రైతులు హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఓ వైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా అంటూ డి.కె.ను ప్రశ్నించారు కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్‌ను కర్ణాటక ప్రజలు క్షమించరని.. తెలంగాణ ప్రజలు విశ్వసించరన్నారు కేటీఆర్‌. ఇక కర్ణాటకలో ఒక్కో హామీ అమలు ఎలా ఫెయిందనేది తన ట్వీట్‌లో చెప్పారు కేటీఆర్.


కేటీఆర్ పూర్తి ట్వీట్‌......

డీకే గారు..

కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది.

దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది మీ చేతకానితనానికి నిదర్శనం.

మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు.

ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా.. ?

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలు విశ్వసించరు.

ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.

మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది.

కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్‌లతో వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలి లో కొట్టుమిట్టాడుతున్నయి.

మీ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు.

రేషన్ పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది.

మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసిని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారింది.

సబ్ స్టేషన్ల వద్ద మొసళ్లతో నిరసనలు.. కరెంట్ కోసం పురుగుల మందు తాగి రైతుల ఆత్మహత్య ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ ఘోర పరిపాలనా వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలు.

మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న మీ గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టింది. ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే మీ హామీ కూడా గంగలో కలిసిపోయింది.

కర్ణాటక లో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోంది

కర్ణాటకలో సకల రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన కాంగ్రెస్ ను నమ్మి మోసపోవడానికి మా ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డ.

జై తెలంగాణ

జై కేసిఆర్

జై బీఆర్ఎస్

First Published:  29 Oct 2023 5:36 AM GMT
Next Story