Telugu Global
Telangana

ఆ 20 నియోజకవర్గాలపై BRS స్పెషల్‌ ఫోకస్‌

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే MIM ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలతో పాటు గోషామహల్‌లోనూ బీఆర్ఎస్ ఏనాడూ గెలవలేదు. ఈ సారి బీఆర్ఎస్ కచ్చితంగా గెలవాలనుకుంటున్న స్థానాల్లో గోషామహల్ ఒకటి.

ఆ 20 నియోజకవర్గాలపై BRS స్పెషల్‌ ఫోకస్‌
X

నవంబర్‌ 30న జరగనున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్‌ను.. ఆ 20 అసెంబ్లీ స్థానాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు గడిచినప్పటికీ ఆ నియోజకవర్గాల్లో ఇప్పటివరకూ BRS విజయం సాధించలేదు.

ఖమ్మం జిల్లాలోని మధిర, భద్రాచలం, ఇల్లందు, సత్తుపల్లి, పినపాక, అశ్వారావుపేట స్థానాల్లో బీఆర్ఎస్‌ ఇప్పటివరకూ గెలుపొందలేదు. ప్రధానంగా బీఆర్ఎస్ ఇప్పటివరకూ గెలుపొందని నియోజకవర్గాలు ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఆ సీట్లలో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని గులాబీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మధిర, భద్రాచలం మినహా ఖమ్మంలోని కొన్ని స్థానాల్లోని ఎమ్మెల్యేలు గతంలోనే బీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ టికెట్‌తో గెలిచిన పలువురు.. ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరి అసెంబ్లీ బరిలో దిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఖమ్మం అసెంబ్లీ సీటును మాత్రమే గెలుపొందిన బీఆర్ఎస్.. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే MIM ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలతో పాటు గోషామహల్‌లోనూ బీఆర్ఎస్ ఏనాడూ గెలవలేదు. ఈ సారి బీఆర్ఎస్ కచ్చితంగా గెలవాలనుకుంటున్న స్థానాల్లో గోషామహల్ ఒకటి. గోషామహల్‌కు 2009లో ముఖేష్‌ గౌడ్ ప్రాతినిథ్యం వహించారు. 2014, 18 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విజయం సాధించారు. గోషామహల్‌ అభ్యర్థిని బీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదు. నియోజకవర్గంలో బలమైన నేత పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. MIMతో దోస్తీ కారణంగా చార్మినార్, మలక్‌పేట్, కార్వాన్, నాంపల్లి, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటోంది.

ఇక రంగారెడ్డి జిల్లాలోనూ ఎల్బీనగర్‌, మహేశ్వరం స్థానాలపైనా బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మహేశ్వరంలో 2014లో తెలుగుదేశం టికెట్‌పై గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. తర్వాత బీఆర్ఎస్‌లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత సబితా ఇంద్రారెడ్డి సైతం గులాబీ గూటికి చేరారు. ఇక ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సైతం కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.

First Published:  12 Oct 2023 2:28 AM GMT
Next Story