Telugu Global
Telangana

కామారెడ్డిలో BRS మునుగోడు స్ట్రాటజీ.. రికార్డు స్థాయి మెజార్టీ లక్ష్యం

హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజవర్గాల కార్యకర్తలతో సమన్వయం చేసుకునేందుకు వార్‌ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు.

కామారెడ్డిలో BRS మునుగోడు స్ట్రాటజీ.. రికార్డు స్థాయి మెజార్టీ లక్ష్యం
X

కామారెడ్డిలో రికార్డు మెజార్టీయే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ సారి కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ బరిలో ఉండట‌మే ఇందుకు కారణం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అనుసరించిన వ్యూహాన్నే కామారెడ్డిలోనూ అమలు చేయాలని భావిస్తోంది. నియోజకవర్గంలోని మండల బూత్‌ స్థాయిల్లో పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించనుంది. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నియమించనుంది. ఈ ఇన్‌ఛార్జులు బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను ఇంటింటికి తిరిగి.. ఓటర్లకు వివరించనున్నారు.

సీఎం కేసీఆర్‌ దేశంలోనే రికార్డు మెజారిటీ సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌. మునుగోడు ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అమలు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు వారివారి నియోజకవర్గాల్లో బిజీగా ఉండగా.. ఇక్కడ స్థానిక నేతలనే ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మొత్తం ప్రచారం, నియోజకవర్గ సమావేశాలను సమన్వయం చేయనున్నారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజవర్గాల కార్యకర్తలతో సమన్వయం చేసుకునేందుకు వార్‌ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు. దసరా తర్వాత నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో వరుస కార్యక్రమాలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. కామారెడ్డిలో నవంబర్‌ 9న సీఎం కేసీఆర్ బహిరంగ సభ, అదే నెల చివరి వారంలో మరో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు.

First Published:  12 Oct 2023 2:39 AM GMT
Next Story