Telugu Global
Telangana

గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే..

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 98 వేల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని, 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగినట్లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తో మరోసారి అందరికీ తెలిసిందని చెప్పారు. సీడబ్ల్యూసీ సహా 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన తర్వాతే కాళేశ్వరం పనులు ప్రారంభించామన్నారు కడియం శ్రీహరి.

గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే..
X

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ గడువుని 100రోజులకు పెంచిందని, ఇప్పుడు కొత్త మోసానికి తెరతీసిందని మండిపడ్డారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కాలయాపన చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారాయన. శ్వేతపత్రాలు, జ్యుడీషియల్‌ ఎంక్వైరీలు, ప్రాజెక్టుల సందర్శన పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త డ్రామాలు మొదలు పెట్టిందన్నారు. కాలయాపనతో ఎన్నికల హామీలను ప్రజలు మరిచిపోతారనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అని ఎద్దేవా చేశారు కడియం.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వాస్తవాలు..

అవినీతి హక్కుదారు కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కడియం శ్రీహరి. గత ప్రభుత్వంపై వేసే ప్రతి విచారణను బీఆర్‌ఎస్‌ ఎదుర్కొంటుందని, ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఎం రేవంత్, రాహు ల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని మంత్రుల మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తేలిందని కడియం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 98 వేల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని, 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగినట్లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తో మరోసారి అందరికీ తెలిసిందని చెప్పారు. సీడబ్ల్యూసీ సహా 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన తర్వాతే కాళేశ్వరం పనులు ప్రారంభించామన్నారు కడియం శ్రీహరి.

వాస్తవాలను పక్కన పెట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రులు జ్యుడీషియల్‌ ఎంక్వైరీని ప్రభావితం చేసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు కడియం శ్రీహరి. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు పై సమగ్ర విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు లంకెబిందెల కోసం అధికారంలోకి వచ్చారా..? అని ప్రశ్నించారాయన. బడ్జెట్‌ గణాంకాలు అధ్యయనం చేయకుండానే హామీలిచ్చారా? అని అడిగారు కడియం.

First Published:  30 Dec 2023 3:22 AM GMT
Next Story