Telugu Global
Telangana

ఎంపీగా పోటీ చేయడం లేదు - దానం నాగేందర్ క్లారిటీ

అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఎంపీగా పోటీ చేయడం లేదు - దానం నాగేందర్ క్లారిటీ
X

తాను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయడంపై తాజాగా దానం క్లారిటీ ఇచ్చారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన స్పష్టం చేశారు.

దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో దానం మంత్రిగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిన దానం నాగేందర్ ఆ తర్వాత కొద్ది రోజులకే బీఆర్ఎస్‌లో చేరారు. ఆ పార్టీ తరపున ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లోనూ, కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గతంలో కాంగ్రెస్ తరపున పని చేసిన దానం నాగేందర్‌ను తిరిగి సొంతగూటికి రప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అంతేకాక గ్రేటర్‌లో కాంగ్రెస్ ఏమంత బలంగా కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరు కూడా గ్రేటర్‌లో కాంగ్రెస్ తరపున గెలవలేకపోయారు. దీంతో దానం వంటి బలమైన నేతను పార్టీలో చేర్చుకొని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

First Published:  17 March 2024 7:30 AM GMT
Next Story