Telugu Global
Telangana

ఎన్నికల వేళ, పొలిటికల్ కుట్ర..

కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే.. ప్రధాని మోదీ బోడిసాయం ఎవరికి కావాలని ప్రశ్నిచారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మోదీ పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వారా మరోసారి రుజువైందన్నారు.

ఎన్నికల వేళ, పొలిటికల్ కుట్ర..
X

NDAలో చేరేందుకు, కేటీఆర్ ని సీఎం చేసేందుకు.. కేసీఆర్ తనను సంప్రదించారంటూ ఇందూరు సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వెంటనే తిప్పికొట్టారు. బీఆర్ఎస్ నేతలు కూడా ప్రధానిపై మండిపడుతున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ అసత్య ప్రచారాలు మొదలు పెట్టారంటున్నారు. ఈ విషయంపై మోదీ ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్.

కొవిడ్ తర్వాత మోదీ ఓసారి హైదరాబాద్ వచ్చారని, అప్పుడు సీఎం కేసీఆర్ ను మోదీనే రావొద్దన్నారని గుర్తు చేశారు వినోద్ కుమార్. కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదని ఆరోపించారు. GHMC ఎన్నికలకు మోదీ పర్యటనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ను చూసి మోదీ భయపడుతున్నారని, ఆయనవి జుమ్లా మాటలు అని మరోసారి నిరూపణ అయిందని చెప్పారు. తెలంగాణతోపాటు తమిళనాడు, కేరళ అంటే కూడా మోదీకి ఇష్టం లేదన్నారు.

నీ బోడి సాయం ఎవరికి కావాలి..?

కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే.. ప్రధాని మోదీ బోడిసాయం ఎవరికి కావాలని ప్రశ్నిచారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మోదీ పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వారా మరోసారి రుజువైందన్నారు. NDAలో చేరాలని కేసీఆర్ ని ఆహ్వానించింది మోదీయేనని చెప్పారు ప్రశాంత్ రెడ్డి. దేశాన్ని అమ్మే వారితో కలవబోమని ఆనాడే సీఎం కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన ప్రధాని మోదీ.. కేసీఆర్ పై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. మోదీ చెప్పిందే నిజమైతే.. ఇన్ని రోజులూ మౌనంగా ఉండి, ఇప్పుడే ఎందుకు నోరు విప్పారని ప్రశ్నించారు. సరిగ్గా ఎన్నికల వేళ, కేసీఆర్ పై నిందలు వేయాలని చూడటం సరికాదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

First Published:  4 Oct 2023 3:51 AM GMT
Next Story