Telugu Global
Telangana

బీఆరెస్ ప్రభుత్వం పనిచేసేదే పేదల కోసం: సీఎం కేసీఆర్

బీఆరెస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, చిరుద్యోగులైన వీఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని సీఎం అన్నారు.

బీఆరెస్ ప్రభుత్వం పనిచేసేదే పేదల కోసం: సీఎం కేసీఆర్
X

బీఆరెస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, చిరుద్యోగులైన వీఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని సీఎం అన్నారు. వీఆర్ ఏ లను క్రమబద్ధీకరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులను సీఎం కేసీఆర్ తన ఛాంబర్ కు పిలిపించుకొని వారితో మాట్లాడారు. వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోపే ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. సుమారు 20 వేల మంది ఉన్న వీఆర్ఏ లలో ముందుగా మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తున్న చేసుకున్న వారి వారసుల వివరాలు, వారి విద్యార్హతలు సేకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మిగతా వారిని వారి అర్హతల ఆధారంగా మున్సిపల్, ఇరిగేషన్ (లష్కర్స్), రెవెన్యూ, జెడ్పీ, ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన శాఖల్లో స్కేల్ ఇస్తూ, తదుపరి ప్రమోషన్ వచ్చే విధంగా వారిని సర్దుబాటు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు.

ఈ విషయంలో వీఆర్ఏ ల సమాచారం ఇవ్వడం సహా, అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. ముందుగా మొత్తం సమాచారాన్ని అధికారులకు అందజేయాలని, వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులకు సూచించారు. వీఆర్ఏ లలో వారి విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కూడా సీఎం అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వీఆర్ ఏ జేఏసీ ప్రతినిధుల్లో రమేష్ బహదూర్, వెంకటేష్ యాదవ్, మాధవ నాయుడు, గోవింద్ తదితరులు ఉన్నారు. వీఆర్ఏ లను క్రమబద్ధీకరిస్తూ కేబినేట్ లో నిర్ణయం తీసుకోవడమే గాకుండా... తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

First Published:  18 May 2023 4:19 PM GMT
Next Story