Telugu Global
Telangana

రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి రైతుబంధు నిధులు..?

బాల్క సుమన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా తెలుస్తోంది.

రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి రైతుబంధు నిధులు..?
X

రైతుబంధు నిధుల విషయంలో సంచలన ఆరోపణలు చేసింది బీఆర్ఎస్. తమ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఖజానాలో రైతుబంధు కోసం తెచ్చిన రూ.7 వేల 700 కోట్లు ఉన్నాయన్నారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌. రైతుబంధు కోసం ఉంచిన నిధులు రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి వెళ్లినట్లు సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోందంటూ కామెంట్ చేశారు. గతేడాది ఈ సమయానికి దాదాపు 5 నుంచి 6 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని.. ఇప్పుడు కనీసం ఎకరం భూమి ఉన్న రైతుకు కూడా పూర్తి స్థాయిలో రైతుబంధు అందని పరిస్థితి నెలకొందన్నారు బాల్క సుమన్‌.

ఇక బాల్క సుమన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా తెలుస్తోంది. రైతుబంధు నిధులను దారి మళ్లించి.. గత ప్రభుత్వ హయాంలో ఆయన సంస్థ చేసిన వివిధ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు క్లియర్ చేశారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.

డిసెంబర్‌ 12నే పాత పద్ధతిలో రైతుబంధు చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దాదాపు 20 రోజులు గడిచినప్పటికీ.. ఎకరా, రెండు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లోనూ పూర్తి స్థాయిలో నిధులు జమ కాలేదు. దీంతో ఇప్పటివరకూ ఎంతమంది రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశారో వాటి వివరాలు రోజు వారీగా చెప్పాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

First Published:  6 Jan 2024 3:47 PM GMT
Next Story