Telugu Global
Telangana

సోష‌ల్ మీడియాలో వీడియోలు పెడుతోంద‌ని.. చెల్లిని చంపేశాడు

రోక‌లిబండ‌తో మోది చంపేసిన‌ అన్న.. త‌న చెల్లెలు రాయి త‌గిలి చ‌నిపోయింద‌ని స్థానికుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై అనుమానం వ‌చ్చిన గ్రామ‌స్తులు పోలీసుల‌కు స‌మాచారం అందించడంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

సోష‌ల్ మీడియాలో వీడియోలు పెడుతోంద‌ని.. చెల్లిని చంపేశాడు
X

సోష‌ల్ మీడియాలో వీడియోలు పెడుతోంద‌ని చెల్లెలిని దారుణంగా హ‌త‌మార్చిన ఘ‌ట‌న సోమ‌వారం రాత్రి జ‌రిగింది. ఆమెను రోక‌లిబండ‌తో మోది చంపేసిన‌ అన్న.. త‌న చెల్లెలు రాయి త‌గిలి చ‌నిపోయింద‌ని స్థానికుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై అనుమానం వ‌చ్చిన గ్రామ‌స్తులు పోలీసుల‌కు స‌మాచారం అందించడంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి సీఐ కరుణాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు మండ‌లం రాజీవ్‌న‌గ‌ర్‌లో అజ్మీర సింధు(21) అలియాస్ సంఘవి త‌న త‌ల్లి, సోద‌రుడు హ‌రిలాల్‌తో క‌లిసి ఉంటోంది. ఆమె మ‌హ‌బూబాబాద్‌లో ఏఎన్ఎం అప్రెంటిస్ చేస్తోంది. సింధు కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ప‌లు వీడియోలు కూడా చేసి అప్‌లోడ్ చేస్తోంది.

ఆమె సోష‌ల్ మీడియాలో వీడియోలు పెట్ట‌డం న‌చ్చ‌ని ఆమె అన్న హ‌రిలాల్ ప‌లుమార్లు వారించాడు. అయినా ఆమె ప‌ట్టించుకోక‌పోవ‌డంతో తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హరిలాల్ రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ తీసుకెళ్తుండగా మృతి చెందింది.

మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామ‌స్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని విచార‌ణ చేప‌ట్ట‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టికే హ‌రిలాల్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టామ‌ని సీఐ పేర్కొన్నారు.

First Published:  26 July 2023 5:41 AM GMT
Next Story