Telugu Global
Telangana

ప్రియురాలి కోసం ప్రియుడి దీక్ష.. మంచిర్యాలలో జంబలకిడి పంబ..

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఓ ప్రియుడు తన ప్రేయసికోసం రోడ్డుపై బైఠాయించి దీక్ష చేపట్టాడు. ఆ దీక్షలో ప్రియుడితోపాటు, అతని తల్లి కూడా ఉండటం విశేషం.

ప్రియురాలి కోసం ప్రియుడి దీక్ష.. మంచిర్యాలలో జంబలకిడి పంబ..
X

ప్రేమించానని చెప్పి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడని, పెళ్లి చేసుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని.. ఇలా రకరకాల కారణాలతో అబ్బాయిల ఇంటిముందు అమ్మాయిలు దీక్ష చేయడం సహజంగా చూస్తుంటాం. కానీ తెలంగాణలో దీనికి పూర్తిగా రివర్స్ సీన్ వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఓ ప్రియుడు తన ప్రేయసికోసం రోడ్డుపై బైఠాయించి దీక్ష చేపట్టాడు. ఆ దీక్షలో ప్రియుడితోపాటు, అతని తల్లి కూడా ఉండటం విశేషం.

అసలేం జరిగింది..?

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణానికి చెందిన చాతరాజు ప్రవీణ్ అనే వ్యక్తి, అదే పట్టణానికి చెందిన ఓ యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. అయితే ఆమెకు ఇటీవల కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పట్టణంలోని మోదెల రోడ్డులో ప్రియురాలి కోసం దీక్ష చేపట్టాడు. తల్లి బానవ్వతో కలిసి రోడ్డుపై బైఠాయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తమ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుస‌ని చెబుతున్నాడు ప్రవీణ్. తామిద్దరం కలసి తీసుకున్న ఫొటోలను చూపిస్తూ.. తమను విడదీయొద్దని అభ్యర్థిస్తున్నాడు.

డబ్బులిచ్చి మోసపోయా..

ప్రేమే కాదు, ఆమెకు భారీ మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చి మోసపోయానంటున్నాడు ప్రవీణ్. ప్రియురాలికి 5 లక్షల రూపాయల డబ్బులిచ్చానని చెబుతున్నాడు. ఆ అమ్మాయి ఇంటిముందు అబ్బాయి దీక్షకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు కుటుంబాల సభ్యులను స్టేషన్ కి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. గతంలో అబ్బాయిలకోసం అమ్మాయిలు ఇలా నిరసనకు దిగిన సందర్భాలున్నాయని, కానీ తొలిసారిగా.. ఓ అమ్మాయికోసం అబ్బాయి ఇలా దీక్షకు దిగడం విచిత్రమైన ఘటన అని అంటున్నారు పోలీసులు.

First Published:  20 Aug 2022 3:43 AM GMT
Next Story